వన్డే వరల్డ్ కప్ కోసం తమ జట్టును పంపాలా? వద్దా? అని పాకిస్తాన్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. దీనికోసం ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బృందాన్ని భారత్కు పంపాలని పాక్ ప్రభుత్వం డిసైడ్ అయింది. భారత్లో పాకిస్తాన్ మ్యాచులు ఉన్న నగరాల్లో ఈ సెక్యూరిటీ బృందం ముందుగా పర్యటిస్తుందని, ఇక్కడి భద్రతా చర్యలను పరిశీలిస్తుందని సమాచారం.
ఈ బృందం ఇచ్చిన నివేదికను బట్టే పాక్ జట్టును పంపేందుకు ఆ దేశ ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందని తెలుస్తోంది. భారత్కు సెక్యూరిటీ బృందాన్ని ఎప్పుడు పంపాలనే నిర్ణయం పీసీబీ కొత్త చైర్మన్ తీసుకుంటాడు. 'పీసీబీ ప్రతినిధులతో కలిసి ఈ డిలిగేషన్ భారత్కు వెళ్తుంది. అక్కడ పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్న నగరాల్లో వరల్డ్ కప్ కోసం తీసుకున్న భద్రతా చర్యలను పరిశీలిస్తుంది' అని ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్ (స్పోర్ట్స్)కు చెందిన ఒక అధికారి తెలిపాడు.

పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్న చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్లో ఈ డిలిగేషన్ పర్యటిస్తుందని సదరు అధికారి స్పష్టం చేశాడు. 'భారత్లో పర్యటనకు ముందు ఇలా ప్రభుత్వం నుంచి పీసీబీ అనుమతి కోరడం మామూలే. అప్పుడు ఇలా ఒక డిలిగేషన్ను పంపడం కూడా చాలా కాలంగా జరుగుతున్నదే' అని ఆ అధికారి చెప్పాడు. ఆయా నగరాల్లో ఉన్న అధికారులతో ఈ డిలిగేషన్ సభ్యులు చర్చలు జరుపుతారట.
'ఈ నగరాల్లోని ప్రభుత్వ అధికారులతో డిలిగేషన్ సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత ఆటగాళ్లు, అభిమానులు, అఫీషియల్స్, మీడియా.. ఇలా అందరికీ ఎలాంటి భద్రత కల్పిస్తున్నారని పరిశీలించడం జరుగుతుంది. ఒక వేళ ఈ డిలిగేషన్ కనుక ఒక వేదికలో ఆడటం కుదరదంటే.. దాన్ని మార్చాలని నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను పీసీబీ తీసుకెళ్లి ఐసీసీ, బీసీసీఐకి అందజేస్తుంది' అని తెలిపాడు.
గతంలో టీ20 వరల్డ్ కప్లో భారత్, పాక్ మ్యాచ్ను మొహాలీ నుంచి మార్చడానికి కూడా ఇలా డిలిగేషన్ ఇచ్చిన నివేదికే కారణమని ఆ అధికారి వివరించాడు. అలాగే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు పాక్ ఈ టోర్నీ ఆడుతుందా? లేదా? అనే విషయం చెప్పలేమన్నాడు. మరి ఈ డిలిగేషన్ ఎప్పుడు భారత్ బయలు దేరుతుందో చూడాలి.