వరల్డ్ కప్ కోసం భారత్కు వచ్చిన పాకిస్తాన్ టీంకు హైదరాబాద్ నగరంలో అదిరిపోయే ఆతిథ్యం లభిస్తోంది. ఇక్కడ ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచే పాక్ టీంకు స్వాగత సత్కారాలు మొదలైపోయాయి. పాకిస్తాన్ అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకొని తమ జట్టుకు స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్లో కూడా వారికి మంచి వెల్కం లభించింది.
ప్రస్తుతం వార్మప్ మ్యాచులు ఆడుతున్న పాకిస్తాన్ జట్టు.. తాజాగా హైదరాబాద్లోని ప్రముఖ 'జువెల్ ఆఫ్ నిజాం'లో డిన్నర్ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోలో బాబర్ ఆజమ్, షహీన్ అఫ్రిదీ తదితర స్టార్ క్రికెటర్లు అందరూ టైట్ సెక్యూరిటీ మధ్య జువెల్ ఆఫ్ నిజాంలో ఎంజాయ్ చేయడం కనిపించింది.

అలాగే ఇక్కడ ఉన్న నిజాం పాలకుల చిత్రాలను కూడా పాక్ టీం సభ్యులంతా చూసుకుంటూ వచ్చారు. హైదరాబాదీ వంటకాలకు పేరెన్నికగన్న జువెల్ ఆఫ్ నిజాంలో వంటలు.. పాక్ టీంకు తెగ నచ్చినట్లు కనిపిస్తోంది. గోల్కొండ హోటల్కు చెందిన ఇక్కడ డిన్నర్ తర్వాత పాక్ టీం అంతా కూడా తమను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్తో సెల్ఫీలు దిగారు. వాళ్లకు ఆటోగ్రాఫులు ఇస్తూ సరదాగా గడిపారు.
ఇక్కడి వంటకాలను రుచి చూసిన పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్.. ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా హైదరాబాదీ రుచులను తెగ మెచ్చుకున్నాడు. తాము తిరిగి పాకిస్తాన్ వెళ్లే సరికే లావెక్కిపోతామేమో? అంటూ జోకులు వేశాడు. ఇక్కడి భోజనం అదిరిపోయిందని, దీంతో ఎంత తింటున్నామో తెలియడం లేదని నవ్వేశాడు. ఏదేమైనా పాక్ టీంకు హైదరాబాద్ వంటలు నచ్చినందుకు ఫ్యాన్స్ కూడా తెగ సంతోషిస్తున్నారు.
ఇక ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు తమొలి మ్యాచులో నెదర్లాండ్స్ను ఎదుర్కొంటుంది. హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 6న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇదే నగరంలో అక్టోబర్ 10న శ్రీలంక టీంను ఢీకొంటుంది. అనంతరం అక్టోబర్ 14న అహ్మదాబాద్ చేరుకొని అక్కడ భారత్, పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్ ఆడుతుంది.