శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ చెలరేగాడు. అద్భుతమైన ఆటతీరుతో పాక్ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక అదరగొట్టింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (106) శతకాలతో సత్తా చాటారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంత భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (12) మరోసారి ఫెయిలయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ (10) కూడా చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఇలా రెండు కీలక వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఈ మ్యాచ్ ఓడిపోతుందేమో అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఈ మ్యాచులో ఫఖర్ జమాన్ స్థానంలో ఆడుతున్న అబ్దుల్లా షఫీక్ (113) అద్భుతంగా ఆడాడు.

బాబర్ అవుటైన తర్వాత షఫీక్కు జతకలిసిన మహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్) కూడా చెలరేగాడు. వీళ్లిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీకి చేరువైన తర్వాత రిజ్వాన్ తొడ కండరాలు బాగా పట్టేశాయి. సింగిల్ తీయడం మాట దేవుడెరుగు.. కనీసం ముందుకొచ్చి భారీ షాట్లు కూడా ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. అయినా సరే జట్టును గెలిపించాలనే పట్టుదలతో ఆడాడీ వికెట్ కీపర్ బ్యాటర్.
అదను దొరికినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ ఎక్కువ పరుగు తీయకుండా ఆడాడు. అతనికి కాసేపు సౌద్ షకీల్ (31) సహకారం అందించాడు. షకీల్ అవుటైన తర్వాత వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ (10 బంతుల్లో 22 నాటౌట్) ధనాధన్ షాట్లతో అలరించాడు. వీళ్లిద్దరూ కలిసి లాంఛనం పూర్తిచేయడంతో పాకిస్తాన్ 48.2 ఓవర్లలోనే మరో ఆరు వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
వరల్డ్ కప్ చరిత్రలో ఇంత భారీ లక్ష్యాన్ని మరే టీం ఛేదించలేదు. ఈ చరిత్ర సృష్టించిన పాక్.. ఈ వరల్డ్ కప్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక రెండు వికెట్లతో సత్తాచాటాడు. మతీష పతిరాణా, మహీష్ తీక్షణ చెరో వికెట్ తీసుకున్నారు.