శ్రీలంకతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టు ఆటగాళ్లను అభినందించింది. పాక్ ఫ్యాన్స్ కూడా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు మ్యాచ్లూ హైదరాబాద్లోనే జరగడం, ఆ మ్యాచ్లలో పాకిస్తాన్ గెలవడంతో ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్కు పాకిస్తాన్ జట్టు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.

ఈ క్రమంలోనే కెప్టెన్ బాబర్ ఆజమ్తో పాటు మిగిలిన ఆటగాళ్లు గ్రౌండ్ స్టాఫ్తో కలిసి ఫోటోలు దిగారు. ఇక కెప్టెన్ బాబర్.. వారికి తమ జెర్సీని కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా ఎక్స్లోపోస్ట్ చేసి ఆటగాళ్లను అభినందించింది.
ఇక ఈ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాకిస్తాన్ జట్టు మరోసారి తమ గొప్ప మనసు చాటుకుందని కామెంట్లు చేస్తున్నారు. బాబర్ ఎంత గొప్ప ఆటగాడో, అంతకంటే అతడి గొప్ప మనసున్న వ్యక్తి అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది భారతీయ యూజర్లు కూడా పాక్ ఆటగాళ్లను అభినందిస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్పై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ జట్టు బుధవారం హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ బయలుదేరనుంది. అక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో 14వ తేదీ శనివారం భారత్తో తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన పాకిస్తాన్.. భారత్పై కూడా గెలిచి రికార్డ్ సృష్టించాలని పట్టుదలగా ఉంది. అలాగే ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఒక్కసారి కూడా భారత్పై పాకిస్తాన్ గెలవలేదు. ఈ రికార్డును కూడా తిరగరాయాలని పాక్ భావిస్తోంది.