నెలరోజులకు పైగా సాగిన వన్డే వరల్డ్ కప్ ముగిసింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్లో తడపడి ట్రోఫీ చేజార్చుకుంది. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ రాణించినా కూడా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ విఫలమయ్యారు.
హాఫ్ సెంచరీ బాదిన తర్వాత అనుకోని విధంగా కోహ్లీ అవుటవగా.. విపరీతమైన ఒత్తిడికి గురైన రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దలేకపోయాడు. ఈ క్రమంలో చివర్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరీ పేలవంగా ఆడాడు. కనీసం బంతిని ఫేస్ చేయడానికి ఆలోచించిన అతను.. టెయిలెండర్లను ఎక్కువగా స్ట్రైకింగ్కు పంపడం ఫ్యాన్స్కు చికాకు తెప్పించింది.

దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ కూడా స్పందించాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ను విమర్శించిన అతను.. అసలు సూర్య ఏం చేయాలని అనుకున్నాడో తనకు అర్థం కాలేదన్నాడు. 'సూర్య ప్లాన్ ఏంటో నాకు అర్థం కాలేదు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో తను తన షాట్లు ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాలి' అని చెప్పాడు.
'కానీ సూర్య మాత్రం సింగిల్స్ తీసుకొని నాన్స్ట్రైకర్ ఎండ్కు వెళ్లిపోయాడు. ఆ టైంలో సూర్య ఏ ఆలోచనతో ఈ పని చేశాడో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. అసలే పిచ్లో కొంత రివర్స్ స్వింగ్ ఉంది. ఆసీస్ వద్ద అద్భుతమైన పేసర్లు ఉన్నారు. వాళ్లను షమీ, బుమ్రా ఆడలేరు కదా. అప్పుడే సూర్య బాధ్యత తీసుకోవాల్సింది. కానీ అతను అలా చేయలేదు' అని సల్మాన్ బట్ తెలిపాడు.
అదే సమయంలో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, రాహుల్తో కలిసి మరో పది ఓవర్లు అతను బ్యాటింగ్ చేసి ఉంటే భారత్ ఈజీగా గెలిచేదని బట్ అభిప్రాయపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తూ కోహ్లీ అవుటయ్యాడని చెప్పాడు. ఆస్ట్రేలియా కీలకమైన సమయాల్లో వికెట్లు తీసుకుందని, దాంతో భారత్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయిందని చెప్పుకొచ్చాడు.