World Cup 2023: వరల్డ్ కప్లో కీలకమైన పోరుకు అంతా రెడీ అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిల్యాండ్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్పై రెండు జట్ల సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచులో శ్రీలంక గెలిస్తే.. పాకిస్తాన్కు సెమీస్ ఆశలు ఉంటాయి. అదే కివీస్ విజయం సాధిస్తే ఆ జట్టే సెమీస్ చేరడం దాదాపు ఖాయం అవుతుంది. దీంతో ఈ మ్యాచ్కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 'వాతావరణం అంత గొప్పగా లేదు. ఏం జరుగుతుందో చెప్పలేం' అని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. అయితే ప్రస్తుతానికైతే తమ ఫోకస్ అంతా.. తాము ఎలాంటి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామో దాని మీదనే ఉందన్నాడు. వరుసగా నాలుగు మ్యాచుల్లో కివీస్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. వీటి కన్నా మెరుగైన ప్రదర్శన చేయాలని అనుకుంటున్నట్లు కేన్ మామ తెలిపాడు.

'మేం ఓడిన మ్యాచుల్లో ఫలితం ఎలాగైనా వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అదే జీవితం కదా. మా ముందు ఏం ఉందో దానిపై ఫోకస్ పెట్టాం. జట్టులో ఐష్ సోధీ స్థానంలో లోకీ ఫెర్గూసన్ను తీసుకున్నాం. అదొక్కటే మార్పు. మేం చివరగా ఇక్కడ ఆడిన దాని కన్నా ఈ పిచ్ వేరుగా కనిపిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.
తాము టాస్ గెలిచి ఉంటే ముందుగా బౌలింగే ఎంచుకునే వాళ్లమని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ అన్నాడు. 'మేం మంచి క్రికెట్ ఆడుతూ వచ్చాం. ఈ మ్యాచులో కూడా స్కోరు బోర్డుపై మంచి స్కోరు ఉంచడానికి ప్రయత్నిస్తాం. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. న్యూజిల్యాండ్ చాలా కామ్గా ఉండే టీం. చివరి మ్యాచ్ ఓడినా కూడా మాపై ఒత్తిడేం లేదు. ఇక్కడ కొన్నిరోజుల క్రితం ఇంగ్లండ్ను ఓడించాం. ఇప్పుడు కూడా రాణిస్తామనే అనుకుంటున్నా' అని చెప్పాడు.
తమ జట్టులో కూడా ఒక మార్పు చేశామని మెండిస్ తెలిపాడు. కాసున్ రజిత ఆడటం లేదని, అతని స్థానంలో చమిక కరుణరత్నేను తీసుకున్నామని వెల్లడించాడు. ప్రస్తుతం ఇక్కడ వాతావరణ బాగానే ఉన్నప్పటికీ 80 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలిస్తుందని నిపుణులు చెప్తున్నారు. బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటారని, వాళ్లకు ఈ పిచ్ కచ్చితంగా పీడకల మిగులుస్తుందని నిపుణుల అభిప్రాయం.