బలమైన బౌలింగ్ ఉందని విర్రవీగే పాకిస్తాన్కు న్యూజిల్యాండ్ బ్యాటర్లు పెద్ద షాకిచ్చారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగారు. పాక్ బౌలింగ్ను తుత్తునియలు చేసిన కివీస్ బ్యాటర్లు ఎడాపెడా బౌండరీలు బాదేశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు సాధించారు.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు నెమ్మదైన ఆరంభం లభించింది. డెవాన్ కాన్వే (35) తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అయితే మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (108) మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాన్వే అవుటైన తర్వాత అతనికి జత కలిసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95) కూడా సూపర్గా ఆడాడు. కానీ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అవుటైపోయాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన డారియల్ మిచెల్ (29), మార్క్ చాప్మన్ (39), గ్లెన్ ఫిలిప్స్ (41), శాంట్నర్ (26 నాటౌట్) ధాటిగా ఆడారు. వీళ్లంతా భారీ షాట్లతో విరుచుకుపడటంతో పాక్ బౌలర్ల వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. ఈ క్రమంలోనే కివీస్ జట్టు 400 పరుగుల మార్క్ దాటింది.
పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. అతనితోపాటు ఇఫ్తికర్ అహ్మద్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్లు అందర్నీ కివీస్ బ్యాటర్లు ఉతికారేశారు. షహీన్ షా అఫ్రిదీ, హారిస్ రవూఫ్ కూడా ఈ బ్యాటర్ల ముందు తేలిపోయారు. పాక్ బౌలింగ్ ఎక్కువగా ఆధారపడే వీళ్లిద్దరూ ఏమాత్రం లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయారు.
ఈ ప్రభావం మిగతా బౌలర్లపై కూడా పడటంతో పాకిస్తాన్ తేలిపోయింది. దానికితోడు పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో కివీస్ బ్యాటర్లు చెలరేగారు. మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడి పాక్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు.