పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో న్యూజిల్యాండ్ను దురదృష్టం వెన్నాడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు ధాటిగా ఆడింది. రచిన్ రవీంద్ర (108), విలియమ్సన్ (95) అద్భుతంగా రాణించారు. డారియల్ మిచెల్ (29), మార్క్ చాప్మాన్ (39), గ్లెన్ ఫిలిప్స్ (41), శాంట్నర్ (26 నాటౌట్) వేగంగా ఆడారు.
ఇలా అందరూ రాణించడంతో కివీస్ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ పేసర్లను వీళ్లందరూ చిన్న పిల్లలా ఆడుకున్నారు. ఛేజింగ్లో కూడా పాక్కు రెండో ఓవర్లోనే షాకిచ్చింది కివీస్. యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (9)ను తక్కువ స్కోరుకే అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత ఏదీ కివీస్ అనుకున్నట్లు జరగలేదు.

వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (126 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి జత కలిసిన బాబర్ ఆజమ్ (66) చక్కని సహకారం అందించాడు. వీళ్లిద్దర్నీ అవుట్ చేయడానికి ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేపోయింది. ఇలాంటి సమయంలో వర్షం పడి కివీస్ వ్యూహాలపై నీళ్లు కుమ్మరించింది.
కాసేపటికి వర్షం ఆగినా.. రెండు ఓవర్ల ఆట జరగ్గానే మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆ తర్వాత వర్షం ఆగేలా లేకపోవడంతో డీఎల్ఎస్ విధానం ప్రకారం పాకిస్తాన్ను విజేతగా ప్రకటించారు అంపైర్లు. ఈ ఓటమిపై న్యూజిల్యాండ్ సారధి కేన్ విలియమ్సన్ స్పందించాడు.
'అంత స్కోరు చేసిన తర్వాత ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం. అయితే ఈ మ్యాచు నుంచి కూడా పాజిటివ్ విషయాలనే తీసుకుంటాం. పాకిస్తాన్ చాలా బాగా ఆడింది. దొరికిన ప్రతి చిన్న ఛాన్స్ పట్టుకొని గెలుపు గీత దాటింది. ఛేజ్ విషయంలో చాలా పక్కగా ఆడింది' అని విలియమ్సన్ చెప్పాడు.
'జమాన్ అద్భుతంగా ఆడాడు. అందుకోసమైనా వాళ్లకు ఈ ఫలితం దక్కాల్సిందే. ఇక దీన్ని మర్చిపోయి మరో మ్యాచ్కు రెడీ అవడంపై ఫోకస్ పెడతాం. మా వరకైతే కొన్ని కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాం. రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. ఇకపై కూడా అతను ఇదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా' అన్నాడు.
'మేం ఇక్కడ కనీసం 450 స్కోరు చేయాలని అనుకున్నాం. ఇక మా బౌలింగ్లో చిన్న చిన్న లోపాలు కనిపించాయి. ఒకటి, రెండు వికెట్లు తీసుకొని పాక్పై ఒత్తిడి పెంచాల్సింది. అది చేయలేకపోయాం. ఈ పరిస్థితిని పాక్ ఫుల్లుగా ఉపయోగించుకుంది. అంతకుమించి ఏం చెప్పలేం' అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.