పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో న్యూజిల్యాండ్ను దురదృష్టం వెన్నాడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు ధాటిగా ఆడింది. రచిన్ రవీంద్ర (108), విలియమ్సన్ (95) అద్భుతంగా రాణించారు. మిగతా బ్యాటర్లు కూడా ధనాధన్ ఇన్నింగ్సులు ఆడారు.
ఇలా అందరూ రాణించడంతో కివీస్ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్లో పాక్కు రెండో ఓవర్లోనే షాకిచ్చింది కూడా. యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (9)ను తక్కువ స్కోరుకే అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత ఏదీ కివీస్ అనుకున్నట్లు జరగలేదు. వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (126 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి జత కలిసిన బాబర్ ఆజమ్ (66) చక్కని సహకారం అందించాడు.

వీళ్లను అడ్డుకోవడానికి కివీస్ ప్రయత్నిస్తుండగానే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఆగగానే మళ్లీ మ్యాచ్ మొదలైంది. ఒక్క ఓవర్ వేశారో లేదో.. మళ్లీ వాన మొదలైంది. ఇక ఆ వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగే సమయానికి పాకిస్తాన్ 25.3 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఇది డీఎల్ఎస్ లక్ష్యాని కన్నా 21 పరుగులు ఎక్కువ.
దీంతో ఈ మ్యాచులో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ బాధ పడుతున్నారు. కేన్ మామ దురదృష్టం అలా ఉందంటున్నారు. ఈ వరల్డ్ కప్లో కేన్ విలియమ్సన్ ఆడిన రెండో మ్యాచ్ ఇది. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచులో అతను రీఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచులో ఫీల్డర్ విసిరిన త్రో చేతికి తగలడంతో మైదానం వీడాడు.
ఆ దెబ్బకు బొటన వేలుకు గాయమై మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు పాక్పై రీఎంట్రీ ఇచ్చిన మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించింది. మరో రెండు వికెట్లు తీసుకుంటే ఆ తర్వాత పాకిస్తాన్ విజయం చాలా కష్టంగా మారుతుందని అంతా అనుకున్నారు. ఆ సమయంలో వర్షం పడి కివీస్ వ్యూహాలపై నీళ్లు కుమ్మరించింది. చివరకు మ్యాచ్ కూడా చేజారేలా చేసింది. దీంతో కేన్ మామా.. ఏంటీ దురదృష్టం? అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.