పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో న్యూజిల్యాండ్ను దురదృష్టం వెన్నాడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు ధాటిగా ఆడింది. రచిన్ రవీంద్ర (108), విలియమ్సన్ (95) అద్భుతంగా రాణించారు. డారియల్ మిచెల్ (29), మార్క్ చాప్మాన్ (39), గ్లెన్ ఫిలిప్స్ (41), శాంట్నర్ (26 నాటౌట్) వేగంగా ఆడారు.
ఇలా అందరూ రాణించడంతో కివీస్ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ పేసర్లను వీళ్లందరూ చిన్న పిల్లలా ఆడుకున్నారు. ఛేజింగ్లో కూడా పాక్కు రెండో ఓవర్లోనే షాకిచ్చింది కివీస్. యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (9)ను తక్కువ స్కోరుకే అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత ఏదీ కివీస్ అనుకున్నట్లు జరగలేదు.

వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (126 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి జత కలిసిన బాబర్ ఆజమ్ (66) చక్కని సహకారం అందించాడు. వీళ్లిద్దర్నీ అవుట్ చేయడానికి ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేపోయింది. ఇలాంటి సమయంలో వర్షం పడి కివీస్ వ్యూహాలపై నీళ్లు కుమ్మరించింది.
కాసేపటికి వర్షం ఆగినా.. రెండు ఓవర్ల ఆట జరగ్గానే మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆ తర్వాత వర్షం ఆగేలా లేకపోవడంతో డీఎల్ఎస్ విధానం ప్రకారం పాకిస్తాన్ను విజేతగా ప్రకటించారు అంపైర్లు. ఈ విజయంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సంతోషం వ్యక్తం చేశాడు.
'బ్యాటింగ్ మొదలు పెట్టినప్పుడు మమ్మల్ని మేం నమ్మాలని డిసైడ్ అయ్యాం. డ్రెస్సింగ్ రూంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక మంచి భాగస్వామ్యం కావాలని అనుకున్నాం. వర్షం వస్తుందని మాకు తెలుసు. కానీ మరీ ఇంత భారీ వర్షం వస్తుందని అనుకోలేదు' అని చెప్పాడు.
'మంచి భాగస్వామ్యం నిర్మించాలనే అనుకున్నాం. సాధ్యమైనంతగా ఫకర్కు స్ట్రైకింగ్ ఇవ్వాలని అనుకున్నా. ఇక్కడ చిన్న బౌండరీలు కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించాం. మా వంద శాతం ఇవ్వడానికి ట్రై చేశాం. కానీ కొన్ని మ్యాచుల్లో రాణించలేకపోయాం. నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచిన తర్వాత ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే పాజిటివ్గా ఆడాలని నిర్ణయించుకున్నాం' అని బాబర్ చెప్పుకొచ్చాడు.