2023 ప్రపంచకప్లో ఇండియా, ఇంగ్లండ్ జట్లే అత్యంత బలమైన జట్లని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాఘన్ అన్నాడు. ఒకవేళ ఈ రెండు జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయంటే అక్కడ వీళ్లని ఓడించడం అసాధ్యమని, అందుకే ఏ జట్టూ కూడా ఇండియా, ఇంగ్లండ్లను సెమీఫైనల్లో ఎదుర్కోవడానికి ఇష్టపడవంటూ టెలిగ్రాఫ్ కోసం తాను రాసిన కాలమ్లో అభిప్రాయపడ్డాడు.
ఇక భారత్తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ కూడా ఈ టోర్నీలో ఫేవరెట్ జట్టని, భారత్లానే ఇంగ్లండ్ కూడా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని వాఘన్ పేర్కొన్నాడు. అందుకే ఈ రెండు జట్లను సెమీఫైనల్లో ఎదుర్కోవడానికి ఏ జట్టూ ఇష్టపడదని అన్నాడు. ముఖ్యంగా భారత్ను సెమీఫైనల్లో ఓడించడం కష్టమని, ఒకవేళ ఏ జట్టైనా అక్కడ భారత్ను ఓడించగలిగితే.. ఆ జట్టే ప్రపంచకప్ గెలుచుకుంటుందని వాఘన్ అన్నాడు.

అది మాత్రమే కాకుండా స్వదేశంలో ఆడుతున్నందున టీమిండియా ఫేవరెట్టే కానీ.. జట్టులో ఎడం చేతి వాటం బ్యాట్స్మెన్ లేకపోవడం భారత్కు పెద్ద దెబ్బేనని, దానివల్ల కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నాడు. 'ప్రస్తుతం టీమిండియాలో కేవలం రవీంద్ర జడేజా మాత్రమే ఎడం చేతి వాటం బ్యాట్స్మన్, అతడు తప్ప ఇంకొక్కరు కూడా లేకపోవం టీమిండియాను ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా రిషబ్ పంత్ లాంటి ఆటగాడు లేకపోవడం భారత్కు తీరని లోటేన'ని వాఘన్ అన్నాడు.
ఒకపక్క బ్యాటింగ్ విషయంలో భారత్ను విమర్శిస్తూనే మరోపక్క టీమిండియా బౌలింగ్ అటాక్ను మాత్రం వాఘన్ ప్రశంసించాడు. భారత్ దగ్గర ప్రపంచ మేటి బౌలర్లున్నారని కితాబిచ్చాడు. పేస్ విభాగంలో బుమ్రా, షమి, సిరాజ్ వంటి సీమర్లు ప్రత్యర్థిని తమ పేస్, స్వింగ్తో భయపెట్టగలరని, అలాగే అశ్విన్, కుల్దీప్ వంటి స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పి బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టగలరని అన్నాడు.
అలాగే భారత్ ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని, అది భారత్కు నిజంగా కలిసొచ్చే అంశమని అన్నాడు. దానికి తోడు 2011, 2015, 2019 ప్రపంచకప్లను గమనిస్తే ప్రతిసారీ ఆతిథ్య దేశమే చాంపియన్గా నిలుస్తోందని, అందుకే ఈ సారి టీమిండియాకు ప్రపంచకప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.