ప్రస్తుతం భారత్లో వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఏ ఇద్దరు క్రికెట్ లవర్స్ కలిసినా వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. కేవలం టోర్నీ మ్యాచులతోపాటు వార్మప్ మ్యాచులు కూడా చూసేందుకు వాళ్లు ఉత్సాహం చూపుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్, న్యూజిల్యాండ్ మధ్య జరిగే వార్మప్ మ్యాచ్ చూసేందుకు రెడీ అయ్యారు. కానీ వారికి బీసీసీఐ షాకిచ్చింది.
ఈ నెల 29న హైదరాబాద్ వేదికగా న్యూజిల్యాండ్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సమయంలో గణేష్ నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ఉండటంతో ప్రజలు భారీ ఎత్తున గుంపులు కడతారని, కాబట్టి మ్యాచ్కు భద్రత ఇవ్వడం కష్టంగా మారుతుందని స్థానిక భద్రతా సంస్థలు హెచ్చరికలు చేశాయట. ఈ వార్నింగ్లను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొని పాకిస్తాన్, న్యూజిల్యాండ్ వార్మప్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించకూడదని డిసైడ్ అయింది.

అదే సమయంలో ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, వారు చెల్లించిన పూర్తి మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని తమ వెబ్సైటులో బీసీసీఐ హామీ ఇచ్చింది. ఈ వేదికలో పాకిస్తాన్ మొత్తం రెండు వార్మప్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఒకటి శుక్రవారం జరగాల్సి ఉండగా.. అక్టోబరు 3న ఆస్ట్రేలియాతో కూడా ఇక్కడే వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
కివీస్తో వార్మప్ మ్యాచ్కు రెండ్రోజుల ముందు అంటే బుధవారం నాడు పాకిస్తాన్ జట్టు భారత్కు చేరుకుంటుందని సమాచారం. ఆసీస్తో రెండో వార్మప్ మ్యాచ్ తర్వాత 6వ తేదీన నెదర్లాండ్స్తో జరిగే మ్యాచుతో పాకిస్తాన్ తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఇక ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వచ్చే నెల 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే.