బలమైన సౌతాఫ్రికాతో ఆడుతూ కూడా పసికూన నెదర్లాండ్స్ గట్టి పట్టుదల ప్రదర్శించింది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆరంభంగా ఆలస్యమైంది. టాస్ తర్వాత మళ్లీ వర్షం పడటంతో ఈ మ్యాచును 43 ఓవర్లకు కుదించాలని నిర్ణయించారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడిందనే చెప్పాలి.
ఆ జట్టుకు సరైన ఆరంభం కూడా దక్కలేదు. విక్రమ్ జీత్ సింగ్ (2), మ్యాక్స్ ఓవుడ్ (18) విఫలమవగా.. కోలిన్ ఆకర్మన్ (2) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన సైబ్రాండ్ ఎంగెల్బ్రెట్ (19), తేజ నిడమనూరు (20) కూడా పెద్దగా రాణించలేదు. దీంతో 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పెద్ద స్కోరు చేసేలా కనిపించలేదు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

తోటి బ్యాటర్లతో కలిసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. లోగన్ వాన్ బీక్ (10) విఫలమైనా కూడా చివర్లో రోలాఫ్ వాన్ డర్ మెర్వ్ (19 బంతుల్లో 29), ఆర్యన్ దత్ (9 బంతుల్లో 23 నాటౌట్) ధనాధన్ షాట్లతో ఇన్నింగ్స్కు మంచి ముగింపు ఇచ్చారు. వీరిద్దరూ చెలరేగడంతో నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు చేయగలిగింది.
అలాగే ఈ మ్యాచులో సౌతాఫ్రికా బౌలర్లు అందరూ వికెట్లు తీసుకోవడం గమనార్హం. గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. లుంగి ఎన్గిడీ, కగిసో రబాడ, మార్కో యాన్సెన్ ముగ్గురూ కూడా తలో రెండు వికెట్లతో రాణించారు. మరి ఈ వరల్డ్ కప్లో అదిరిపోయే జోరు మీదున్న సౌతాఫ్రికా.. ఈ మ్యాచులో విజయం సాధిస్తుందో లేక పసికూన నెదర్లాండ్స్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి.