కొంతకాలంగా కొత్త బంతితో చెలరేగుతున్న టీమిండియా యంగ్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించాడు. ఆసియా కప్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సిరాజ్.. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు దూసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత వరల్డ్ కప్ వరకు అతను ఆడలేదు. ఆ సమయంలో మిగతా టీంలు ద్వైపాక్షిక సిరీసులు ఆడాయి.
దానికితోడు వరల్డ్ కప్ ఆరంభమైన తర్వాత సిరాజ్ బౌలింగ్లో కొంత మెరుపు తగ్గింది. దీంతో నెంబర్ వన్ ర్యాంకు అతని చేజారింది. ఆసీస్ స్టార్ పేసర్ హాజిల్వుడ్, కివీస్ ఎడం చేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ స్థానం కోసం పోటీ పడ్డారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో సిరాజ్ మళ్లీ గాడిన పడ్డాడు.

ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో కూడా మూడు వికెట్లతో చెలరేగాడు. తను బంతి అందుకున్న తొలి ఓవర్లోనే టీమిండియాకు బ్రేక్ ఇస్తూ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో తను కోల్పోయిన రేటింగ్ పాయింట్స్ మళ్లీ సాధించిన సిరాజ్.. తాజాగా విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం 709 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్లో ఉండగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఆల్రౌండర్ కేశవ్ మహరాజ్ (694 పాయింట్లు) ఉన్నాడు. ప్రస్తుతం వన్డే బౌలర్ల జాబితాలో టాప్ టెన్లో నలుగురు భారత బౌలర్లు ఉండటం గమనార్హం. సిరాజ్ అగ్రస్థానంలో ఉండగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
అలాగే మంచి ఫామ్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా 8వ ర్యాంకులో నిలవగా.. వరల్డ్ కప్లో నిప్పులు చెరుగుతున్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కూడా టాప్ టెన్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం షమీ పదో స్థానంలో ఉన్నాడు. అతను కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే సిరాజ్ స్థానానికి షమీనే ఎసరు పెట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.