World Cup 2023: వరల్డ్ కప్లో మంచి జోరు మీదున్న టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఇంగ్లండ్ను ఏకంగా 100 పరుగుల తేడాతో చిత్తుచేసింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన టీమిండియాకు హార్దిక్ పాండ్యా గాయం గట్టి షాకిచ్చింది. జట్టులో మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అలాంటి వాడు గాయంతో జట్టుకు దూరం అవడంతో భారత్కు తిప్పలు తప్పవని అంతా అనుకున్నారు. అది కూడా ఆ తర్వాతి మ్యాచ్ బలమైన న్యూజిల్యాండ్తో. దాంతో ఆ మ్యాచులో భారత్ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ పాండ్యా లేకపోవడంతో జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

తను ఈ వరల్డ్ కప్లో ఆడిన తొలి మ్యాచులోనే ఐదు వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. ఒక విధంగా కివీస్పై టీమిండియా గెలిచిందంటే దానికి కారణం షమీ బౌలింగే. ఆ తర్వాత లక్నో వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో అతన్ని పక్కన పెట్టేస్తారని వార్తలు రావడంతో అంతా షాకయ్యారు. ఇక్కడి పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
దీంతో షమీని పక్కన పెట్టేసి అశ్విన్ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ మాత్రం షమీకే ఓటేశాడు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్న షమీ.. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమలో ఒక అరుదైన మైలురాయికి చేరువయ్యాడీ వెటరన్ పేసర్.
వరల్డ్ కప్లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ పేసర్ జహీర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 23 వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్సులు ఆడి 44 వికెట్లు తీసుకున్నాడు.
ఇక రెండో స్థానంలో మరో లెజెండ్ జవగళ్ శ్రీనాథ్ ఉన్నాడు. శ్రీనాథ్ మొత్తం 33 ఇన్నింగ్సులు ఆడి 44 వికెట్లు తీసుకున్నాడు. ఇక షమీ అయితే కేవలం 13 ఇన్నింగ్సుల్లోనే 40 వికెట్లతో సత్తా చాటాడు. ప్రస్తుతం షమీ ఉన్న ఫామ్ చూస్తుంటే తర్వాతి మ్యాచులోనే వీళ్లిద్దర్నీ అధిగమించి.. వరల్డ్ కప్లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.