ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఫేవరెట్లలో ఒకటిగా పాకిస్తాన్ను చెప్పుకున్నారు. కానీ టోర్నీ ఆరంభమైన తర్వాత పాకిస్తాన్ టీం దారుణంగా తడబడింది. ప్రాక్టీస్ మ్యాచుల్లో ఘోరంగా ఓడింది. ఆ తర్వాత రెండు విజయాలు సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టింది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ టీం మరీ మెత్తగా కనిపించిందని, ఇంత సాఫ్ట్గా ఉన్న పాకిస్తాన్ జట్టును ఇప్పటి వరకు తాను చూడలేదని కైఫ్ అన్నాడు. 'బాబర్ ఆజమ్, షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్.. వీళ్లంతా కూడా అవసరమైన దాని కన్నా మరీ ఎక్కువ ఫ్రెండ్లీగా కనిపించారు' అని కైఫ్ ఆరోపించాడు. అందుకే ఈ మెగాటోర్నీ నుంచి పాకిస్తాన్ అర్ధంతరగా తప్పించుకోవాల్సి వచ్చిందన్నాడు.

'ఈ పాకిస్తాన్ టీం మరీ సాఫ్ట్గా కనిపిస్తోంది. వాళ్ల పేసర్లు కూడా నైస్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వసీం, వఖాస్, షోయబ్ అక్తర్ .. వీళ్లంతా ఒకప్పుడు ప్రత్యర్థిని వణికించేవారు. వాళ్లు బౌలింగ్ చేశాక బ్యాటర్ వైపు సీరియస్గా లుక్ ఇచ్చేవాళ్లు. అవసరమైతే స్లెడ్జింగ్ కూడా చేసేవాళ్లు' అని కైఫ్ గుర్తుచేసుకున్నాడు.
కానీ బాబర్ అండ్ టీం దగ్గర అలాంటి ఆరా ఏమాత్రం లేదని, వాళ్లు స్నేహపూర్వకంగా ఉండేందుకే ప్రయత్నించారని కైఫ్ చెప్పాడు. ఇదేం తప్పు కాకపోయినా జట్టులో ఇంటెన్సిటీ కనుమరుగవుతుందని వివరించాడు. ఇక గణాంకాలు చూసుకున్నా కూడా ఈ ఇద్దరు ప్రధాన పేసర్లు తేలిపోయారనే చెప్పాలి.
ఈ మెగా టోర్నీలో అఫ్రిదీ 18 వికెట్లు, రవూఫ్ 11 వికెట్లు తీసుకున్న మాట వాస్తవమే. కానీ వీళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. ఏ ప్రధాన బ్యాటర్ కూడా వీళ్లను అంత సీరియస్గా తీసుకోలేదు. ఇక బాబర్ ఆజమ్ కూడా ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. మొత్తం 9 మ్యాచులు ఆడిన అతను కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు.