క్రికెట్లో థ్రిల్లింగ్ విక్టరీలకు కొదవలేదు. కొన్ని మ్యాచులు చూసే సమయంలో ఆ టెన్షన్ తట్టుకోలేక కొందరు అభిమానులు గుండె ఆగిపోవడం కూడా మనకు తెలిసిందే. అలాంటి థ్రిల్లింగ్ మ్యాచులను భారత ప్రేక్షకులకు చాలా ఎక్కువగా ఇచ్చిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఎంత పెద్ద స్కోరును ఛేజ్ చేయాలన్నా సరే కోహ్లీ కనుక క్రీజులో ఉంటే గెలుస్తామనే నమ్మకం కలిగించాడీ ఛేజ్ మాస్టర్.
ప్రత్యర్థులకు కూడా ఇదే ఆలోచన ఉంటుందని పాక్ లెజెండరీ పేసర్ మహమ్మద్ ఆమిర్ అన్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ మరోసారి తానేంటో నిరూపిస్తూ పాకిస్తాన్పై భారత్ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ మ్యాచులో భారత్ ఓడిపోవడం ఖాయమని కోహ్లీ తప్ప అంతా అనుకున్నారు. చివరకు అందరూ తప్పేనని, తనే కరెక్టని కోహ్లీ నిరూపించాడు.

అజేయమైన 82 పరుగులతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఆ సమయంలో తాను మరో మాజీ పేసర్ వాహబ్ రియాజ్తో ఈ ఇన్నింగ్స్ గురించి మాట్లాడానని ఆమిర్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచులో పాకిస్తాన్ టీంకు, విజయానికి మధ్య కోహ్లీ అడ్డుగోడలా నిలబడ్డాడని చెప్పాడు. ఆ టైంలో పాకిస్తాన్ గెలిచేస్తుందని వాహబ్ రియాజ్ చాలా నమ్మకంగా ఉన్నాడట.
కానీ ఆమిర్ మాత్రం కోహ్లీ క్రీజులో ఉంటే మ్యాచ్ ముగిసినట్లు కాదనే ఆలోచనలోనే ఉన్నట్లు చెప్పాడు. దీని గురించి చెప్పిన ఆమిర్.. 'నేను ఆ మ్యాచ్ టీవీలో చూస్తున్నా. అప్పుడు నా పక్కనే వాహబ్ రియాజ్ కూడా ఉన్నాడు. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు కావలసి ఉన్నప్పుడు నేను రియాజ్తో ఒకటే మాట చెప్పా. ఇండియా ఇంకా ఓడిపోలేదని' అంటూ ఆమిర్ తమ కన్వర్జేషన్ను వెల్లడించాడు.
'కోహ్లీ అక్కడ ఉన్నంత వరకు.. ఇండియా మ్యాచ్ ఓడిపోయినట్లు కాదు. అలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ను కోహ్లీ తప్ప ప్రపంచంలో మరెవరూ ఆడలేరని రియాజ్కు గ్యారంటీ కూడా ఇచ్చా. నన్నడిగితే కోహ్లీ డిక్షనరీలో ప్రెషర్ అనే పదం లేదు. కోహ్లీని అడిగినా సరే.. పాకిస్తాన్పై ఆడిన ఆ ఇన్నింగ్స్ తన కెరీర్ బెస్ట్ అని ఒప్పుకుంటాడు' అని ఆమిర్ అన్నాడు.
ఈ వరల్డ్ కప్లో ఏ టీంకైనా సరే డేంజర్ మ్యాన్ కోహ్లీనే అని ఆమిర్ తేల్చిచెప్పేశాడు. తను ఇప్పుడు టాప్ ఫామ్లో ఉన్నాడని, ప్రస్తుతం కోహ్లీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉందని అభిప్రాయపడ్డాడు. గతేడాది నెలకుపైగా క్రికెట్కు దూరంగా ఉన్న కోహ్లీ.. రీఎంట్రీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.