నెదర్లాండ్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అదరగొట్టారు. ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ దంచికొట్టడంతో భారత జట్టు ఏకంగా 410 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ఆ తర్వాత బౌలింగ్లో కూడా టీమిండియా సమిష్టిగా రాణించింది. చివరకు కోహ్లీ, రోహిత్ కూడా ఈ మ్యాచులో బౌలింగ్ చేసి వికెట్లు తీసుకున్నారు. వీరితోపాటు శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేశారు. ఇలా అందరూ చాలా సరదాగా గడిపారు. దీనిపై ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాను ఈ టోర్నీలో ఓడించడం అసాధ్యంలా కనిపిస్తోందన్నాడు.

అయితే ఒత్తిడిలో ఈ టీం ఎలా రాణిస్తుందో చూడాలని అన్నాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచుల్లో తడబడటం ఇటీవలి కాలంలో టీమిండియాకు బాగా అలవాటైంది. ఈ క్రమంలో కివీస్తో సెమీస్, ఆ తర్వాత ఫైనల్లో భారత్ ఎలా ఆడుతుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటమే లేకుండా లీగ్ దశను ముగించిన భారత్ గురించి మైక్ హస్సీ తన అభిప్రాయం చెప్పాడు.
'ప్రస్తుతం ఇండియా అద్భుతమైన జట్టులా కనిపిస్తోంది. ఆ టీం కూర్పు కూడా సూపర్గా ఉంది. ఒక ఛాంపియన్ టీంకు ఉండాల్సిన అన్ని పాయింట్లనూ ఈ టీం కవర్ చేసింది. చాలా కాన్ఫిడెంట్గా ఆడుతోంది. ప్రస్తుతం వాళ్లు ఉన్న మూమెంట్ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు, ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది' అని హస్సీ అభిప్రాయపడ్డాడు.
'ఈ వరల్డ్ కప్ గెలిచే టీంలా టీమిండియా కనిపిస్తోంది. దానిలో ఎలాంటి డౌట్ లేదు. అయితే స్వదేశంలో ఆడుతున్నామనే ఒత్తిడిని ఇండియా తట్టుకుంటుందా? అనేదే నా ప్రశ్న. తమ ప్రేక్షకుల ముందు ఆడుతూ సరైన రిజల్ట్ను డెలివర్ చేయడం అంత ఈజీ కాదు. అదీ ముఖ్యంగా ఓడితే ఇంటికే అనే మ్యాచుల్లో ఆ ఒత్తిడి మరీ ఎక్కువ. అది ఈ టీం మానసిక పరిస్థితిని మారుస్తుందా? అనే నా అనుమానం' అని వివరించాడు.