వరల్డ్ కప్లో తమ తొలి మ్యాచులోనే సౌతాఫ్రికా చెలరేగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో శ్రీలంకను ఈ టీం ఎదుర్కొంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా (8) విఫలమైనా కూడా.. క్వింటన్ డీ కాక్ (100), రాసీ వాన్ డర్ డస్సెన్ (108) శతకాలతో చెలరేగారు. వీరిద్దరి ఆటతీరు చూసిన సౌతాఫ్రికా ఫ్యాన్స్ తెగ సంతోషించారు.
కానీ ఆ తర్వాత అసలు సిసలు తుఫాన్ వచ్చింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఎయిడెన్ మార్క్రమ్ (106) చెలరేగాడు. కంటికి కనిపించిన ప్రతి బంతినీ బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్ కప్లలో అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఐర్లాండ్ బ్యాటర్ కెవిన్ ఓబ్రెయిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. అతను 50 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఈ రికార్డు గురించి మాట్లాడిన మార్క్రమ్.. తను గత కొన్నేళ్లలో బ్యాటింగ్ విషయంలో చాలా మెరుగయ్యానని చెప్పాడు. తమ టీం నిదానంగా టోర్నీ ప్రారంభిస్తుందని పేరుండేదని, ఇప్పుడు అందరు బ్యాటర్లు ఎటాకింగ్ గేమ్ ఆడటం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే తను సాధించిన రికార్డు ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఈ వరల్డ్ కప్లోనే అది మళ్లీ బద్దలయ్యే అవకాశం ఉందన్నాడు.
'ప్రస్తుతం బ్యాటర్లు ఆడుతున్న విధానం చూస్తుంటే.. నా రికార్డు ఈ వరల్డ్ కప్లోనే బద్దలైనా ఆశ్చర్యం ఉండదు. కాబట్టి ఈ గేర్లో మా టీం అంతా చెలరేగడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఒక బ్యాటర్గా ఎదగాలనే అంతా అనుకుంటారు. దీని కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఫలితం ఉంటుంది. మనం ఎప్పుడూ అనుకోని ఆట ఆడటం కూడా మనల్ని బాగా మార్చేస్తుంది' అని చెప్పుకొచ్చాడీ సఫారీ విధ్వంసకారుడు.