వరల్డ్ కప్లో టీమిండియా చేతిలో ఓడి విమర్శలపాలు అవుతున్న పాకిస్తాన్ టీంకు మరో పెద్ద సమస్య వచ్చిపడింది. తమ తదుపరి మ్యాచులో ఆస్ట్రేలియాను పాక్ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఈ మ్యాచుకు ముందు పాకిస్తాన్ టీంలో కొందరు కీలక ప్లేయర్లకు వైరల్ ఫీవర్ సోకిందట. దీంతో ఆ టీం ఫ్యాన్స్ అంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు.
పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, పేసర్ షహీన్ షా అఫ్రిదీ, సౌద్ షకీల్ వంటి కీలక ప్లేయర్లకు ఫీవర్ సోకినట్లు తెలుస్తోంది. వీరిలో షఫీక్ను అతని హోటల్ గదిలోనే క్వారంటైన్లో ఉంచాల్సి వచ్చిందట. అయితే షహీన్ అఫ్రిదీ మాత్రం వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. అతను కనుక త్వరగా తేరుకుంటే శుక్రవారం జరిగే ఆస్ట్రేలియా మ్యాచులో అతను ఆడే అవకాశం ఉంది.

అంతేకాదు, ఈ పరిస్థితుల వల్లనే పాకిస్తాన్ జట్టు మంగళవారం నాడు ప్రాక్టీస్ కూడా చేయలేదు. కానీ బుధవారం మాత్రం ప్రాక్టీస్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ప్రకటన చేసింది. 'కొన్ని రోజులుగా జట్టులోని కొందరు ప్లేయర్లు జ్వరంతో బాధ పడుతున్నారు' అని పీసీబీ వెల్లడించింది.
'అయితే జ్వరం బారిన పడిన వారంతా దాదాపుగా కోలుకున్నారు. వాళ్లందర్నీ మెడికల్ ప్యానెల్ అబ్జర్వేషన్లో ఉంచాం' అని తెలిపింది. కొన్నిరోజుల క్రితం భారత్తో జరిగిన మ్యాచ్ సమయంలో పాక్ స్పిన్నర్ ఉసామా మిర్ అనారోగ్యంతో బాధ పడుతూ ఉన్నాడట. ఈ మ్యాచులోనే భారత యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు.
సరిగ్గా వరల్డ్ కప్ ఆరంభం సమయంలో గిల్కు డెంగ్యూ సోకింది. దాని నుంచి కోలుకున్న అతను పాకిస్తాన్తో మ్యాచులో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ మ్యాచులో పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సభ్యులు ఎవరిలోనూ డెంగ్యూ లక్షణాలు లేవని పీసీబీ తెలిపింది.