వన్డే వరల్డ్ కప్ టీంను బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో కేఎల్ రాహుల్కు చోటివ్వడంపై చాలా విమర్శలు వచ్చాయి. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని రాహుల్ను వరల్డ్ కప్లో డైరెక్ట్గా ఎలా ఆడిస్తారని ఫ్యాన్స్ కూడా నిలదీశారు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరూ కూడా మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ స్థానానికి పోటీ ఇస్తున్నారు. వీళ్లలో సంజూను పక్కన పెట్టేసిన సెలెక్టర్లు రాహుల్, కిషన్ ఇద్దర్నీ జట్టులో ఎంపిక చేశారు.
ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినా అది సరైన డెసిషనే అని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. వరల్డ్ కప్ మొదలయ్యేలోపు తన ఫిట్నెస్ నిరూపించుకోవడానికి రాహుల్ వద్ద చాలా టైం ఉంటుందని గవాస్కర్ చెప్పాడు. పలువురు మాజీలు కూడా రాహుల్ సెలెక్షన్ను తప్పుబట్టారు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఒక ప్లేయర్ను ఎలా టీంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు.

ఈ ఏడాది ఐపీఎల్లో ఆడుతుండగా రాహుల్ గాయపడ్డాడు. దీంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్సీయేలో రీహాబిలేషన్లో ఉన్నాడు. అతన్ని ఆసియా కప్లో కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే కొత్తగా మరో గాయం అవడంతో అతను ఈ టోర్నీ గ్రూప్ దశ మ్యాచులకు దూరంగా ఉన్నాడు. సూపర్-4 మ్యాచుల నుంచి అతను జట్టుతో చేరతాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో రాహుల్ ఫిట్నెస్పై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడిన సునీల్ గవాస్కర్.. 'బ్యాటుతో రాహుల్ తన వాల్యూ చాలాసార్లు నిరూపించుకున్నాడు. ఇలా సత్తాచాటిన వారికి కొంచెం లీవే దక్కుతుంది. ఇప్పుడు జరిగింది అదే. అతను ఆటకు ఇంతకాలం దూరంగా ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశమే' అని సన్నీ ఒప్పుకున్నాడు.
'ఇప్పుడు రాహుల్ కూడా శ్రీలంక వెళ్లి టీంతో కలుస్తాడు. అక్కడ కొన్ని మ్యాచులు ఆడతాడు. కాబట్టి ఈ మ్యాచుల్లో తన ఫిట్నెస్ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా రాహుల్ ఫిట్నెస్ టెస్ట్ చెయ్యొచ్చు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఫిట్నెస్ విషయం పక్కన పెడితే ఈ ఏడాది వన్డేల్లో రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆరు మ్యాచుల్లో 226 పరుగులు చేశాడు.