World cup 2023: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్: బంగ్లాదేశ్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. కానీ భారత యువ బ్యాటర్లపై మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఇలాగే ఆడుతూ పోతే భారీ ఇన్నింగ్సులు ఎలా ఆడతారంటూ నిలదీశాడు. అవసరమైన సమయంలో క్రీజులో ఎలా పాతుకుపోవాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని సూచించాడు.
పూణె వేదికగా మ్యాచ్ లో గిల్ అర్థ సెంచరీతో రాణించగా.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీ బాది జట్టుకు అలవోకగా విజయాన్ని అందించాడు. మ్యాచ్ తర్వాత సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. అదే సమయంలో యువ బ్యాటర్లు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ల బ్యాటింగ్ పై తీవ్రంగా విమర్శించాడు.

"క్రీజులో ఎలా పాతుకుపోవాలో, ఇన్నింగ్స్ ను భారీగా ఎలా మలచాలో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో చూపించాడు. బౌండరీలపైనే ఆధారపడకుండా తన మార్క్ సింగిల్స్, టూడీలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు." అంటూ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు గవాస్కర్. అలాగే కోహ్లీ ఇన్నింగ్స్ యువ బ్యాటర్లందరికీ ఓ పాఠం లాంటిదని, ముఖ్యంగా శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్లు ఇంకా ఎంతో నేర్చుకోవాలని గవాస్కర్ అన్నాడు.
"ఈ మ్యాచ్ లో గిల్, అయ్యర్ ఇద్దరూ సహనం కోల్పోయి వికెట్ పారేసుకున్నారు. గిల్ అర్థ సెంచరీ పూర్తి చేసిన తర్వాత సహనం కోల్పోయాడు. అందుకే భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. సరిగ్గా అయ్యర్ కూడా అలాగే ఔటయ్యాడు. గిల్ ఈ మధ్య కాలంలో సెంచరీలు, హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కానీ అయ్యర్ అలా కాదు. ఈ మధ్యకాలంలో ఒక్క సెంచరీ మినహా అతడు గొప్పగా ఆడిందేమీ లేద"ని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
యువ క్రికెటర్లు ఎక్కువ సేపు క్రీజులో ఉండడం, ఇన్నింగ్స్ ను సహనం తో బిల్డ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం పై దృష్టి పెట్టాలన్నాడు. అప్పుడే మెరుగైన బ్యాటర్లు అవుతారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి తర్వాతి మ్యాచుల్లో అయినా ఈ కుర్రాళ్లు సుదీర్ఘమైన ఇన్నింగ్సులు ఆడతారేమో చూడాలి.