వరల్డ్ కప్కు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని జట్ల చూపూ ట్రోఫీ మీదనే ఉంది. ఇలాంటి సమయంలో దాదాపు అందరు నిపుణులు కూడా ఈ వరల్డ్ కప్ ఫేవరెట్లలో భారత్ ఒకటని అంటున్నారు. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమిండియా.. ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఇదే మాట అన్నాడు.
జోస్ బట్లర్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వరల్డ్ కప్లో అడుగు పెడుతోంది. ఈ టైటిల్ను నిలబెట్టుకోవాలంటే ఇంగ్లండ్ రక్తం చిందించాల్సి వస్తుందని బ్రాడ్ చెప్పాడు. అదే సమయంలో భారత్ కనుక తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే.. ఆ టీంను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బలంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో భారత్, ఇంగ్లండ్ జట్లకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయనే విషయంపై బ్రాడ్ మాట్లాడాడు. ఇంగ్లండ్ కనుక తమ టైటిల్ను కాపాడుకుంటే అది చాలా గొప్ప విషయం అన్నాడు. అదే సమయంలో భారత్ను తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు. 'ఇంగ్లండ్ కనుక తమ వరల్డ్ కప్ టైటిల్ను తిరిగి సొంతం చేసుకుంటే.. అంత కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు' అని బ్రాడ్ తెలిపాడు.
'అయితే భారత్ కనుక తమ పర్ఫెక్ట్ టోర్నమెంట్ ఆడితే.. ఆ టీంను ఆపడం దాదాపు అసాధ్యమని నా గట్టి నమ్మకం. బట్లర్ దగ్గర చాలా మంచి టీం ఉంది. భారీ లక్ష్యాలు నిర్దేశించే సత్తా ఉన్న టీమే అది. కానీ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న ఇండియాను ఎదుర్కోవడం ఇంగ్లండ్కు కష్టమని నా భావన. వాళ్లు ప్రస్తుతం వన్డేల్లో కూడా నెంబర్ వన్ టీంగా ఉన్నారు కదా' అని వివరించాడు.