ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి వరల్డ్ కప్ మ్యాచులో భారత జట్టు అద్భుతమైన పోరాటంతో గెలిచింది. కేవలం 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి ఆదుకున్నారు. అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ను లక్ష్యానికి చేరువ చేశారు.
చివర్లో కోహ్లీ, రాహుల్ ఇద్దరిలో ఎవరో ఒకరు సెంచరీ పూర్తి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతం స్కోరు 85 పరుగుల వద్ద కోహ్లీ అవుటయ్యాడు. దీంతో కనీసం రాహుల్ అయినా సెంచరీ చేసుకుంటాడని ఫ్యాన్స్ భావించారు. రాహుల్ కూడా అదే మాదిరి ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు.

చివరకు భారత విజయానికి 5 పరుగులు, రాహుల్ సెంచరీకి 9 పరుగులు అవసరం అయ్యాయి. ఇలాంటి సమయంలో అతను మొదట ఒక ఫోర్ బాది, ఆ మరుసటి బంతికి సిక్సర్ బాదితే రాహుల్ సెంచరీతోపాటు భారత్ విజయం కూడా ఖరారవుతుంది. ఇది తెలిసిన రాహుల్ అలాగే చేద్దామని అనుకున్నాడు.
ప్యాట్ కమిన్స్ వేసిన 42వ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదేందుకు రాహుల్ ప్రయత్నించాడు. అయితే మంచి టైమింగ్తో ఈ షాట్ కనెక్ట్ అయింది. దీంతో ఆ బంతి వెళ్లి బౌండరీ లైన్ ఆవల పడింది. అది సిక్సర్ కావడంతో రాహుల్ సెంచరీ మిస్ అయింది. ఈ షాట్ కొట్టిన తర్వాత రాహుల్ తన కళ్లను తనే నమ్మలేకపోయాడు.
కేవలం ఫోర్ కోసమే తను ప్రయత్నిస్తే అది సిక్సర్ వెళ్లిందని షాకైపోయాడు. బంతి సిక్సర్ వెళ్లగానే తన క్రీజులో కూర్చొని నోరెళ్లబెట్టి ఆ షాట్ వైపు చూస్తుండిపోయాడు. అయితే ఇక చేసేదేం లేదని అర్థం చేసుకున్న అతను.. బ్యాటు పైకెత్తి సెంచరీ సెలబ్రేట్ చేకున్నట్లే ఈ విజయాన్ని సెటబ్రేట్ చేసుకున్నాడు.
ఫ్యాన్స్ కూడా గట్టి చప్పట్లు రాహుల్ను మెచ్చుకున్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి 97 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. కొన్ని 97లు సెంచరీల కన్నా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.