ఆసీస్తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో భారత జట్టు అద్భుతంగా పుంజుకొని ఘనవిజయం సాధించింది. ఛేజ్ తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయిన భారత్కు రెండో ఓవర్లో రెండు షాకులు తగిలాయి. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కనీసం స్కోరు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టుకు దాదాపు విజయం ఖరారైందనగా కోహ్లీ అవుటయ్యాడు. అతను సెంచరీ పూర్తి చేసుకుంటాడని అనుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందారు. పోనీ రాహుల్ అయినా సెంచరీ చేస్తాడనుకుంటే అతను కూడా శతకానికి మూడు పరుగుల దూరంలో ఉండగానే మ్యాచ్ ముగిసింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తను ఇంత పట్టుదలగా ఆడటానికి కారణం విరాట్ కోహ్లీనే అని రాహుల్ చెప్పాడు. 'రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చినప్పుడు నేను, కోహ్లీ పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. వికెట్ కీపింగ్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి విశ్రాంతి తీసుకుందామని అనుకున్నా. ఆ టైం కూడా నాకు దొరకలేదు' అని రాహుల్ అన్నాడు.
'అప్పుడు విరాట్ నాతో.. ఇక్కడ వికెట్ బౌలర్లకు సహకరిస్తోంది. కాబట్టి కాసేపు టెస్టు క్రికెట్లా ఆడు. పేసర్లకు కొంచెం హెల్ప్ ఉంది. ఆ తర్వాత స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారు అని సలహా ఇచ్చాడు. నేను అదే ఫాలో అయ్యా' అని రాహుల్ వెల్లడించాడు. ఆ తర్వాత కొంచెం మంచు రాగానే బ్యాటింగ్ చేయడం సులభమైందని చెప్పుకొచ్చాడు.
'చివరి 15-20 ఓవర్లలో మంచు బాగా ప్రభావం చూపించింది. అది మాకు బాగా కలిసొచ్చింది. అయితే ఈ పిచ్ రెండు వైపులా బౌలర్లకు సహకారం ఇచ్చింది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకని ఇదేం ఫ్లాట్ వికెట్ కూడా కాదు. నన్నడిగితే ఇది చాలా మంచి క్రికెట్ వికెట్ అని చెప్తా. ఇక్కడ బౌలర్లకు, బ్యాటర్లకు అందరికీ ఎంతో కొంత సహకారం లభించింది' అని పేర్కొన్నాడు.