గత వరల్డ్ కప్ రన్నరప్లుగా నిలిచిన న్యూజిల్యాండ్కు ఈ వరల్డ్ కప్ ఆరంభంలో చుక్కెదురైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే వరల్డ్ కప్ తొలి మ్యాచులో న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆడటం లేదట. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచులోనే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ గాయం వల్ల ఇప్పటి వరకు విలియమ్సన్ పెద్దగా క్రికెట్ ఆడలేదు. ఇటీవల మళ్లీ మైదానంలో అడుగు పెట్టిన అతన్ని వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. గత వరల్డ్ కప్లో విలియమ్సన్ కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్లిన న్యూజిల్యాండ్.. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ కూడా డ్రా అవడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మళ్లీ ఇప్పుడు ఆ రెండు జట్ల మధ్య పోరుతోనే వరల్డ్ కప్ మొదలవనుంది. కానీ ఈ మ్యాచులో విలియమ్సన్ ఆడటం లేదు. ఈ విషయం తెలియగానే ఫ్యాన్స్ వెంటనే ఇలాగే గతంలో జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. ఇలా ఒక టీం పర్మినెంట్ కెప్టెన్ గతంలో వరల్డ్ కప్లో తొలి మ్యాచ్ను మిస్ అయినప్పుడు.. అదే కెప్టెన్ చివరకు ట్రోఫీ నెగ్గాడని అంటున్నారు.
ఇది 2015 వరల్డ్ కప్లో జరిగింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్.. ఆ ఏడాది వరల్డ్ కప్ తొలి మ్యాచ్ మిస్సయ్యాడు. అయితే చివరకు అతని కెప్టెన్సీలో ఆసీస్ ఆ వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడింది. ఇదే విషయం చెప్తున్న అభిమానులు ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే కేన్ మామ కప్పు కొట్టేస్తాడని అంటున్నారు. ఏదేమైనా విలియమ్సన్ త్వరగా కోలుకొని వరల్డ్ కప్లో రాణించాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.