శ్రీలంకపై భారత బౌలింగ్ విభాగం మరోసారి చెలరేగింది. ఆ టీంను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 357 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు తొలి బంతికే షాకిచ్చాడు బుమ్రా. ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే రెండో ఓవర్ తొలి బంతికి సిరాజ్ కూడా వికెట్ తీసుకున్నాడు. ఆ ఓవర్లో అతను రెండు వికెట్లతో రాణించాడు. ఇలా వీళ్లిద్దరూ చెలరేగడంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

టీమిండియా స్టార్ పేసర్లు అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బుమ్రా తీసింది ఒక వికెటే అయినా అద్భుతమైన బౌలింగ్తో శ్రీలంక బ్యాటర్లను వణికించాడు. ఇలాంటి సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపించాడు.
తన బౌలింగ్ యాక్షన్ను స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వాంఖడే దద్దరిల్లేలా 'కోహ్లీ కో బాల్ దో' (కోహ్లీకి బంతి ఇవ్వు) అంటూ రోహిత్ శర్మకు అర్జీ పెట్టుకున్నారు. అయితే రోహిత్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఇక పదో ఓవర్లో బంతి అందుకున్న షమీ కూడా సూపర్ బౌలింగ్తో ఆ ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఇలా కోహ్లీ చేత బౌలింగ్ చేయించాలంటూ ఫ్యాన్స్ అడుగుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కూడా కోహ్లీ చేత కూడా బౌలింగ్ చేయించాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచులో భారత జట్టు 302 పరుగుల తేడాతో నెగ్గి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.