INDvsSL: ఈ వరల్డ్ కప్లో టీమిండియా మంచి జోరు మీద ఉంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. చివరగా బలమైన న్యూజిల్యాండ్పై విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత శ్రీలంకతో భారత్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించిన కీ అప్డేట్ ఒకటి వచ్చింది.
భారత్, శ్రీలంక ఆడే మ్యాచు టికెట్లను గురువారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారట. టీమిండియా ఆడే మ్యాచుల టికెట్లు ఎంత వేగంగా అమ్ముడుపోతాయో అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఛాన్స్ మిస్ అయితే తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూసే అవకాశం పోతుందని టెన్షన్ పడుతున్నారు.

గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్, శ్రీలంక మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టనున్నారు. ఎప్పట్లాగే బుక్మైషో యాప్లో ఈ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ముంబై స్టేడియంలో కేవలం 33 వేల సీట్లు మాత్రమే ఉంటాయి. దీంతో టికెట్ల అమ్మకం మొదలైన నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో 1.30 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్ వీక్షించే అవకాశం ఉంది. అయినా సరే ఆ మ్యాచ్ టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే మాయమైపోయిన సంగతి తెలిసిందే. అసలే బుక్మైషోలో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయడం చాలా ఇబ్బందిగా ఉందని, బుక్మైషో తమను మోసం చేస్తోందని ఫ్యాన్స్ ఇప్పటికే చాలాసార్లు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే.
టికెట్లు ఆన్లైన్లోకి వచ్చిన నిమిషాల్లోనే అయిపోవడం, భయంకరమైన వెయిటింగ్ లిస్టులు చూపించడం, అంత వెయిట్ చేసినా చివరకు టికెట్లు దొరక్కపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఈ భారత్, శ్రీలంక టికెట్లు కూడా ఇలాగే వేగంగా అమ్ముడుపోతే.. ఫ్యాన్స్ మరోసారి బీసీసీఐ, బుక్మైషోను ట్రోల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.