శ్రీలంకకు టీమిండియా మరోసారి చుక్కలు చూపించింది. ఏకంగా 302 పరుగుల తేడాతో భారత జట్టు జయభేరి మోగించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 357 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనిలో శ్రేయాస్ అయ్యర్ (82) కూడా కీలక పాత్ర పోషించాడు.
ధనాధన్ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడీ ముంబై కుర్రాడు. ఇండియా వర్సెస్ మ్యాచ్ అనంతరం అతను విలేకరులతో మాట్లాడాడు. ఈ సమయంలో అతనికి ఉన్న షార్ట్ బాల్ సమస్య గురించి ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతే అయ్యర్కు విపరీతంగా కోపం వచ్చేసింది.

తను అలాంటి సమస్యలే లేవని అయ్యర్ బల్లగుద్ది మరీ చెప్పాడు. అవన్నీ అబద్ధాలన్నాడు. 'ఈ వరల్డ్ కప్ ఆరంభం నుంచి షార్ట్ బాల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది' అని విలేకరి అనగానే అయ్యర్కు విసుగొచ్చేసింది. 'నాకు అది సమస్య అంటే? అంటే అర్థం ఏంటి?' అని నిలదీశాడు.
'నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? నేను ఎన్ని పుల్షాట్స్తో పరుగులు రాబట్టానో చూశావా? ముఖ్యంగా అవి ఎన్ని ఫోర్లు వెళ్లాయో తెలుసా? ఒక బంతిని కొట్టడానికి ట్రై చేస్తే అవుటయ్యే ప్రమాదం ఉన్నట్లే కదా. అది షార్ట్ బాల్, ఓవర్ పిచ్ బాల్ ఏదైనా సరే. నేను కనుక రెండు, మూడు సార్లు బౌల్డ్ అయితే.. మీరంతా కలిసి నేను ఇన్స్వింగింగ్ డెలివరీలు ఆడలేనని, బంతి సీమ్ అవుతుంటే కట్ ఆడలేనని ప్రచారం మొదలు పెట్టేస్తారు' అని అయ్యర్ ఘాటుగా సమాధానమిచ్చాడు.
'ప్లేయర్స్గా మేం ఎలాంటి బంతికైనా అవుటయ్యే ప్రమాదం ఉంది. మీరంతా కలిసి నేను షార్ట్ బాల్ ఆడలేననే వాతావరణం క్రియేట్ చేశారు. ఇది చూసిన చాలా మంది అప్పుడప్పుడూ దాన్ని రిపీట్ చేస్తారు. మీ మీడియా వాళ్ల బుర్రల్లో ఇక అది అలాగే ఉండిపోతుంది. దాంతో మీరు దాని మీదనే వర్క్ చేయడం మొదలు పెడతారు' అంటూ అయ్యర్ చురకలేశాడు.