శ్రీలంకపై భారత బౌలింగ్ విభాగం మరోసారి రెచ్చిపోయింది. లంకేయులను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 357 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు తొలి బంతికే షాకిచ్చాడు బుమ్రా. ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే రెండో ఓవర్ తొలి బంతికి సిరాజ్ కూడా వికెట్ తీసుకున్నాడు. ఆ ఓవర్లో అతను రెండు వికెట్లతో రాణించాడు. ఇలా వీళ్లిద్దరూ చెలరేగడంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత బంతి అందుకున్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ.. దాదాపుగా వేసిన ప్రతి ఓవర్లో వికెట్ తీసుకున్నాడు.

ఈ క్రమంలో కేవలం 18 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత జట్టు ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అక్తర్.. భారత్కు తిరుగులేదన్నాడు. ఇలాగైతే భారత్ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని చెప్పాడు.
'ఇండియా తిరుగులేని టీంగా మారుతోంది. వాళ్లను ఇక అడ్డుకోవడం అసాధ్యం అనిపిస్తోంది. వాళ్ల ఫాస్ట్ బౌలర్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేదే నా కోరిక. వాంఖడేలో వాళ్లు వేసిన ప్రతి బంతిలో ఎగ్జయిట్మెంట్ కనిపించింది. ప్రతి డెలివరీకి ఏదో జరుగుతుందని అనిపించింది' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.
'షమీ మళ్లీ ఫామ్ అందుకున్నందుకు నేను వ్యక్తిగతంగా హ్యాపీగా ఫీలవుతున్నా. మూడు మ్యాచుల్లోనే అతను 14 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, బుమ్రా కూడా చెలరేగుతున్నారు. బుమ్రా ఉన్నాడు కాబట్టే మిగతా ఇద్దరు బౌలర్లు స్వేచ్ఛగా ఆడగలిగారు. బుమ్రా సత్తా మామూలుది కాదు. టోర్నీ చివరి వరకు వీళ్లు ముగ్గురూ ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నా' అని అక్తర్ పేర్కొన్నాడు.