World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్లో ఓటమి ఎరుగని టీం ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఇలా అజేయ రికార్డు నిలబెట్టుకోవడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర చాలానే ఉంది. తన వద్ద ఉన్న బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకోవడం, చక్కని ఫీల్డింగ్ వ్యూహాలతో రోహిత్ అందరి మన్ననలు పొందుతున్నాడు.
ముఖ్యంగా బంగ్లాదేశ్తో మ్యాచులో బంతి అందుకున్న మూడో బంతికే పాండ్యా గాయంతో మైదానం వీడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో అతను తన బౌలర్లను ఉపయోగించుకున్న తీరుకు చాలా మంది మాజీలు దాసోహం అన్నారు. ఆ తర్వాత కూడా రోహిత్ అదే స్థాయి కెప్టెన్సీ పరిణితి చూపించాడు.

బ్యాటుతో కూడా జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ మాత్రం తనకు వస్తున్న ప్రశంసలను సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పాడు. 'పరిస్థితిని అర్థం చేసుకోవాలి. స్కోర్ బోర్డును బట్టి సరైన ఎత్తులు వేయాలి. ఒక్కోసారి మన ఎత్తులు పని చేస్తాయి. ఒక్కోసారి బెడిసి కొడతాయి అంతే' అన్నాడు హిట్మ్యాన్.
'ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాంటి ప్లాన్లు వేసినా సరే.. అదంతా జట్టు కోసమే అనుకుంటే అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ప్రశంసలు ఇవన్నీ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఒక్క మ్యాచ్లో నా వ్యూహాలు బెడిసి కొడితే అంతే సంగతులు. అప్పుడు అందరూ నన్ను బ్యాడ్ కెప్టెన్ అనే అంటారు' అని తెలిపాడు.
ఇటీవల పలువురు మాజీలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టోర్నీలో బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మనే అని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే మిగతా అన్ని జట్ల కన్నా ముందు టీమిండియానే సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కేవలం కెప్టెన్సీతోనే కాకుండా బ్యాటుతో కూడా రోహిత్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.