వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్కు వచ్చింది. ఈ క్రమంలో తన సొంత మైదానంలో ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ వరల్డ్ కప్లో రోహిత్ అద్భుతమైన ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతను ఈ మ్యాచులో కూడా తనకు బాగా తెలిసిన మైదానంలో చెలరేగుతాడని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ ఆరంభమైన క్షణాల్లోనే పరిస్థితులు మారిపోయాయి.

ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాదిన రోహిత్.. అభిమానుల్లో ఉత్సాహం పెంచాడు. కానీ ఆ తర్వాత రెండో బంతికే మధుశంక వేసిన ఆఫ్కట్టర్ డెలివరీకి తడబడ్డాడు. చక్కని లైన్లో వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని ఆడటంలో రోహిత్ మిస్ అయ్యాడు. అది వికెట్లను కూల్చింది.
ఇలా రోహిత్ అవుట్ అవ్వడాన్ని ఫ్యాన్స్ నమ్మలేకపోయారు. ఆ ఒక్క వికెట్తో సడెన్గా వాంఖడే స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటి వరకు రోహిత్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిర్ఘాంతపోయారు. అంత మంచి ఫామ్లో ఉన్న నీకు ఏమైంది? అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో ఇన్నింగ్స్ మూడో బంతికే విరాట్ కోహ్లీ క్రీజులోకి రావలసి వచ్చింది. రోహిత్ వంటి బ్యాటర్ ఇలా అవుట్ అవడంతో కోహ్లీ, గిల్ ఇద్దరిపైనా ఒత్తిడి పెరిగింది. వీళ్లిద్దరూ చాలా ఆచితూచి ఆడారు. అదే సమయంలో లంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో రెండు, మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
మధుశంక వేసిన మరో ఓవర్లో గిల్ కొట్టిన షాట్.. చరిత్ ఆశలంక వైపుగా వెళ్లింది. అతను తన ఎడమ చేతి వైపు అద్భుతంగా డైవ్ చేసి, గాల్లోనే ఆ బంతిని అందుకోబోయాడు. కానీ బంతి అతని చేజారింది. దీంతో గిల్కు ఒక జీవనదానం లభించింది.
ఆ తర్వాత కాసేపటికే దుష్మంత చమీర బౌలింగ్లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు కోహ్లీ ట్రై చేశాడు. అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో చమీరకు ఎడం వైపుగా బంతి గాల్లో వెళ్లింది. దాన్ని అందుకోబోయిన చమీర.. బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతి అతని చేతిలో నిలవలేదు. కింద పడినప్పుడు అతని భుజానికి కూడా గాయమైంది.
ఇలా ముగ్గురు కీ బ్యాటర్లు లంక బౌలింగ్లో తడబడుతూ ఆడటం చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు. వరుస ఓటములతో ఉన్న లంక బౌలర్లు ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారా? లేక భారత బ్యాటింగ్ లైనప్ తడబడుతోందా? అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.