సౌతాఫ్రికాపై టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. టేబుల్ టాపర్ల మధ్య పోరులో కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు రోహిత్ శర్మ (40) ధనాధన్ ఆరంభం అందించాడు. అయితే మరో ఓపెనర్ గిల్ (23) పెద్దగా రాణించలేదు.
ఉండే కొద్దీ స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్పై విరాట్ కోహ్లీ (101 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శ్రేయాస్ అయ్యర్ (77)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయ్యర్ అవుటైన తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (8) విఫలమైనా సూర్యకుమార్ యాదవ్ (22), రవీంద్ర జడేజా (29 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించారు.

దీంతో భారత జట్టు 326 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టు ఇంత స్కోరు చేయడంలో కోహ్లీది కీలక పాత్ర. చివర్లో సూర్య, జడేజా కూడా స్వేచ్ఛగా ఆడేందుకు అతనే కారణం. ఇన్నింగ్స్ మొత్తం క్రీజులోనే ఉన్న అతను.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం కోహ్లీని తిట్టిపోస్తున్నారు.
సెంచరీ కోసం కోహ్లీ నెమ్మదిగా ఆడాడని, 121 బంతుల్లో సెంచరీ చేయడం ఏంటని? అంటున్నారు. కోహ్లీది పూర్తి సెల్ఫిష్ ఇన్నింగ్స్ అని విమర్శలు చేశారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ చాలా కఠినంగా ఉందని, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ చూసిన తర్వాతైనా అది అర్థం చేసుకోవాలని అంటున్నా ఏవేవో కారణాలు చెప్తున్నారు. వీరందరికీ మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
'కోహ్లీకి వ్యక్తిగత మైలురాళ్లు అంటే పిచ్చని, అందుకే సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడాడని ఫన్నీ వాదనలు వింటున్నా. అవును నిజమే.. కోహ్లీ సెల్ఫిష్. వంద కోట్ల మంది కలలను వెంటాడేంత సెల్ఫిష్. ఎంతో సాధించినా ఇంకా ఏదో సాధించాలనుకునే సెల్ఫిష్. కొత్త బెంచ్మార్కులు పెడుతూ, జట్టు గెలుపు కోసం ఎప్పుడూ ప్రయత్నించేంత సెల్ఫిష్' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.