క్రికెట్లో చాలా రికార్డులు ప్రతిరోజూ బద్దలవుతూనే ఉంటాయి. కానీ కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం అసంభవం. అయితే కొన్నిసార్లు కొంత మంది ప్లేయర్లు వస్తారు. వాళ్లే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచానికి కొత్త మార్గం చూపిస్తుంటారు. అలాంటి వాడే విరాట్ కోహ్లీ. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో అద్భుతమైన సెంచరీ బాదిన అతను.. సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
వైట్ బాల్ క్రికెట్లో అంటే వన్డే, టీ20లు కలిపి 50 సెంచరీలు బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. అలాగే వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్గా సచిన్ పేరిట ఉన్న 49 శతకాల రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి కోహ్లీకి శుభాకాంక్షలు అందుతున్నాయి. అది కూడా తన పుట్టిన రోజునే సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం గమనార్హం.

ఈ క్రమంలో ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్తో మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదిక ఎక్కిన సల్మాన్.. 'అసలు మీ రికార్డులు ఎవరైనా బద్దలు కొడతారంటారా?' అని సచిన్ను అడిగాడు. దీనికి నవ్వేసిన సచిన్.. 'ఆ బద్దలు కొట్టేవాళ్లు ఈ రూంలోనే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు నా రికార్డులు బద్దలు కొట్టేస్తారు. వీళ్లు తప్ప ఇంకెవరి వల్లా కాదనే అనుకుంటున్నా' అని చెప్పాడు.
ఇది 2012లో జరిగిన ఘటన. అది జరిగిన 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డును సమం చేశాడు. ఈ వరల్డ్ కప్లోనే మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును కూడా దాటేస్తాడు. ఇదే విషయాన్ని చెప్పుకుంటున్న ఫ్యాన్స్.. ఎవరైనా జోస్యం చెప్తే ఇలా కదా చెప్పాలి అంటున్నారు. ఏదేమైనా తన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టినందుకు సచిన్ కూడా తెగ సంతోషించాడు. అతనిపై సచిన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.