వరల్డ్ కప్లో సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న రెండు జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు.
'పిచ్ చాలా బాగుంది. అంత కన్నా ఎక్కువగా మేం ముందు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. ఒక టీంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా మంచి మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాం. పాయింట్ల పట్టికలో టాప్ -2 టీమ్స్ మధ్య మ్యాచ్ కాబట్టి అలాగే జరగాలి కదా. ఈ చారిత్రాత్మక స్టేడియంలో ఆడటం అంటే టీమిండియాకు ఎప్పుడూ ఇష్టమే' అని రోహిత్ చెప్పాడు.

తాము టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగే చేయాలని అనుకున్నట్లు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. అదే సమయంలో ఇలా ఛేజింగ్ చేయాల్సి రావడం కూడా తమకు మంచిదేనన్నాడు. 'ఛేజింగ్ విషయంలో మేం కొంత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మాకు కాన్ఫిడెన్స్ రావడం చాలా ముఖ్యం' అని చెప్పుకొచ్చాడు.
పిచ్ను బట్టి తమ జట్టులో ఒక కీలక మార్పు చేసినట్లు తెలిపాడు. యంగ్ పేసర్ గెరాల్డ్ కోట్జీ ఆడటం లేదని, అతని స్థానంలో తబ్రయిజ్ షంసీని తీసుకున్నామని చెప్పాడు. ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేలా ఉందని, అదే సమయంలో ఒక ఎండ్ నుంచి స్పిన్నర్లు చెలరేగా ఛాన్స్ కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే సఫారీ టీంలో షంసీని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా స్పిన్నర్లకు సహకరించే పిచ్పై రవిచంద్రన్ అశ్విన్ను రోహిత్ ఆడిస్తాడని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ ఆ నిర్ణయం తీసుకోలేదు. ఈ పిచ్పై కూడా ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలో దిగాడు. ఇది అంత గొప్ప నిర్ణయం కాదని కొందరు నిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డీ కాక్, టెంబా బవుమా (కెప్టెన్), రాసీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడీ, తబ్రయిజ్ షంసీ