వరల్డ్ కప్లో టీమిండియా ఎదురు లేకుండా దూసుకుపోతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో కూడా భారత జట్టు దుమ్మురేపింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ (40), కోహ్లీ (101 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (77) రాణించారు.
అనంతరం బంతితో భారత బౌలర్లు చెలరేగారు. జడేజా ఐదు వికెట్లతో రెచ్చిపోగా.. షమీ, కుల్దీప్ తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. దీంతో సౌతాఫ్రికా జట్టు కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు ఏకంగా 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన సంబరాలు మిన్నంటాయి.

అంతా అయిపోయాక ఎప్పట్లాగే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. 'బెస్ట్ ఫీల్డర్'ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు. ప్రతి మ్యాచులో కొత్తగా ఈ మెడల్ అందుకునే వారి పేరు ప్రకటిస్తున్న దిలీప్.. ఈసారి బగ్గీ క్యామ్ను వాడాడు. టీమిండియా ప్లేయర్లు అందరూ నిలబడి ఉండగా.. బగ్గీ క్యామ్ నెమ్మదిగా వచ్చి ఒక్కొక్కరినే దాటుకుంటూ వెళ్లింది.
చివరకు కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు వచ్చి ఆగింది. దీంతో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ తదితరులు అంతా వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని రోహిత్కు కంగ్రాట్స్ చెప్పారు. ఈ విజేతను ప్రకటించడానికి ముందు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా తదితరుల ఫీల్డింగ్ను దిలీప్ తెగ మెచ్చుకున్నాడు.
కానీ మైదానంలో అద్భుతమైన వ్యూహాలతో మ్యాచ్ గెలవడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. ఈ వ్యూహాలతో పాటు మంచి ఫీల్డింగ్ కూడా చేసినందుకే ఈ అవార్డును రోహిత్కు ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కూడా దిలీప్ నిర్ణయాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది రోహిత్ అందుకున్న మొదటి 'ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కావడం గమనార్హం.