టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే జరుపుకుంటున్నాడు. 35వ వసంతంలో అడుగు పెట్టిన అతనికి ప్రపంచం నలుమూలల నుంచి బర్త్ డే విషెస్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే టీంమేట్స్ కూడా కోహ్లీపై తమ మనసులోని మాట పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ఇన్స్టాలో పంచుకుంది.
ఈ వీడియోలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన ద్రావిడ్.. తన తరంలోని క్రికెటర్లకు ఒక బెంచ్ మార్క్లా కోహ్లీ మారాడని కొనియాడాడు. క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ అని, ముఖ్యంగా వన్డేల్లో అతనంత బెస్ట్ ప్లేయర్ మరొకరు లేరని కితాబిచ్చాడు.

'అన్ని ఫార్మాట్లలో కోహ్లీ లెజెండే. కానీ ముఖ్యంగా ఈ ఫార్మాట్లో కోహ్లీని కొట్టేవాడు లేడు. అతని ఆట చూస్తే.. మ్యాచ్ను కోహ్లీ ఫినిష్ చేసే విధానం, ఇంత కాలంగా అతను మ్యాచులు ఫినిష్ చేస్తున్న తీరు.. ఇవన్నీ కూడా ఈ తరం ప్లేయర్లకు ఒక బెంచ్మార్క్గా మారాడు' అని మెచ్చుకున్నాడు.
అంతకుముందు కూడా కోహ్లీ గురించి ద్రావిడ్ మాట్లాడాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మెగాటోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ వద్ద ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. దీని గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన ద్రావిడ్.. అవసరమైతే బౌలింగ్ చేయడానికి తమ వద్ద స్పెషల్ బౌలర్ ఉన్నాడని చెప్పాడు.

'నిజమే, మా దగ్గర ఆరో బౌలింగ్ ఆప్షన్ లేదు. కానీ మా దగ్గర ఒక రాంగ్ ఫుటెడ్ ఇన్స్వింగర్ మెనేస్ ఉంది. కావాలంటే అతను కొన్ని ఓవర్లు వేయగలడు. లాస్ట్ మ్యాచులో కూడా అతను బౌలింగ్ వేయాల్సింది. ప్రేక్షకులే అతన్ని బౌలింగ్ చేయాలంటూ గొడవ చేశారు కూడా' అని చెప్పాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచులో కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలంటూ వాంఖడే ప్రేక్షకులు పెద్ద పెద్దగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ కూడా తన బౌలింగ్ యాక్షన్ చూపించాడు. కానీ మ్యాచ్ అంతదూరం రాలేదు.