World Cup 2023: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్లో టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 పరుగులు చేశాడు. తొలి స్థానంలో ఉన్న క్వింటన్ డీ కాక్కు కోహ్లీకి మధ్య కేవలం 7 పరుగులే తేడా ఉంది.
తాజాగా సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచులో విరాట్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై పట్టుదలగా ఆడాడు. భారీగా స్పిన్ అవుతున్న బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన పుట్టినరోజున సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చాలా మంది అతని సెంచరీని 'సెల్ఫిష్' అంటూ విమర్శించారు.

వీరిలో పాకిస్తాన్ మాజీ దిగ్గజం మహమ్మద్ హఫీజ్ కూడా ఒకడు. 'నాకు కోహ్లీ బ్యాటింగ్లో స్వార్థం కనిపించింది. 49వ ఓవర్లో తన సెంచరీ పూర్తి చేసుకోవడానికి అతను సింగిల్ తీయడంపై ఫోకస్ పెట్టాడు. అంతేకానీ టీం కోసం ఆలోచించలేదు. రోహిత్ కూడా ఇలాగే స్వార్థంగా క్రికెట్ ఆడి ఉండొచ్చు. కానీ అతను టీమిండియా కోసం ఆడాడు. తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాదు' అని హఫీజ్ అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. 'ఇండియా అద్భుతంగా ఆడుతూ 8 టీమ్స్ను చిత్తు చేసింది. కోహ్లీ ఇప్పుడు 49 సెంచరీలు చేశాడు. లాస్ట్ మ్యాచులో ఆ కఠిన పిచ్పై అతని పని యాంకర్ రోల్ పోషించడమే. అతని టీం 200 పరుగులపైగా తేడాతో మ్యాచ్ గెలిచింది. నీ మాటలు చెత్తగా ఉన్నాయి' అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన సెంచరీ పూర్తయిన తర్వాత కోహ్లీ కూడా ఇలాంటి మాటలే చెప్పాడు. బంతి పాత పడేకొద్దీ బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని, అప్పుడే టీం నుంచి తనకు కమ్యూనికేషన్ వచ్చిందని అన్నాడు. తను చివరి వరకు క్రీజులో ఉంటే, మిగతా వాళ్లు తన చుట్టూ ఆడటమే తనకు అందిన ప్లాన్ అని వివరించాడు. ఆ బాధ్యతను తాను నిర్వర్తించానని చెప్పుకొచ్చాడు.