వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో టాప్-2 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.
ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచుల్లో అద్భుతమైన విజయాలు సాధించాయి. శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక ఈ టోర్నీలో ఒక్క నెదర్లాండ్స్ చేతిలో తప్ప మిగతా ఏ మ్యాచులోనూ సఫారీలు ఓడిపోలేదు. ముఖ్యంగా సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రబాడ, కేశవ్ మహరాజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు.

ఇక భారత్, సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ రెండు జట్లు 90 సార్లు వన్డే మ్యాచులో తలపడ్డాయి. వీటిలో భారత్ 37 మ్యాచుల్లో విజయం సాధించింది. సౌతాఫ్రికా 50 మ్యాచుల్లో గెలిచింది. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక్క మ్యాచ్ కూడా టై అవ్వలేదు. అయితే మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
ఇక వరల్డ్ కప్ల విషయానికొస్తే.. మెగాటోర్నీలో భారత్, సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఐదు సార్లు తలపడ్డాయి. వీటిలో కూడా సౌతాఫ్రికానే పైచేయి సాధించింది. ఈ ఐదు మ్యాచుల్లో భారత్ కేవలం రెండు విజయాలే సాధించగా.. సౌతాఫ్రికా మూడు మ్యాచుల్లో జయభేరి మోగించింది. అయితే చివరి రెండు వరల్డ్ కప్లలో సౌతాఫ్రికాపై భారత్ పైచేయి సాధించడం గమనార్హం.
2015 వరల్డ్ కప్లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచులో 130 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. ఇక 2019 వరల్డ్ కప్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.