క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే హైప్ వేరు. దాయాదుల పోరు చూసేందుకు క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటుంది. అదే వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీలో ఈ రెండు టీమ్స్ తలపడితే? ఇక ఆ మ్యాచ్కు ఉండే హైప్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది వరల్డ్ కప్లో అదే జరగబోతోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో పెట్టిన గంటలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఈ టికెట్ల కోసం ఎంతో మంది ఫ్యాన్స్ రోజుల తరబడి వెయిట్ చేశారు. కానీ చివరకు వారికి అవి దక్కలేదు. ఈ క్రమంలోనే ముందే టికెట్లు బుక్ చేసుకున్న కొందరు వీటిని బ్లాక్లో అమ్మేందుకు రెడీ అయ్యారు. ఇలా అమ్మకానికి పెట్టిన టికెట్లు ఏకంగా రూ.57 లక్షల వరకు ధర పలుకుతున్నాయంటే నమ్ముతారా?

ఇలా ఎలాంటి లైవ్ ఈవెంట్స్కు సంబంధించిన టికెట్స్ అయినా దొరికే సెకండరీ మార్కెట్లలో వయాగోగో ఒకటి. ఇది ప్రపంచంలోనే పెద్ద సెకండరీ మార్కెట్ అని కొందరు అంటారు. దీనిలో వరల్డ్ కప్కు సంబంధించిన అన్ని మ్యాచుల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. చివరకు వార్మప్ మ్యాచుల టికెట్లు కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు. అయితే వీటి ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది.
ఈ వరల్డ్ కప్లో భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొంటుందన్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టికెట్లను వయాగోగో అమ్ముతోంది. ఇక్కడ ఈ టికెట్లు ఏకంగా రూ.41,118 నుంచి రూ.1.67 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ఆసీస్తో మ్యాచ్ టికెట్లే ఇంత భారీ ధర పలుకుతుంటే.. ఇక పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల రేట్ ఏంటి? అని అనుమానం రావడం సహజమే.
ఈ వెబ్సైటులో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు కూడా దొరుకుతున్నాయి. అయితే వీటిని సామాన్యులెవరూ కొనలేరు. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ఒక్కొక్కటి రూ.57, 198 నుంచి ఏకంగా రూ.57.15 లక్షల వరకు పలుకుతోంది. అంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ చూడాలంటే టికెట్ ధర అరకోటి పైనే అన్నమాట. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను నెట్టింట పంచుకుంటున్న ఫ్యాన్స్.. ఇంత దారుణమా? అని మండిపడుతున్నారు.
ఇలా వరల్డ్ కప్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతుంటే బీసీసీఐ, ఐసీసీ ఏం చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇలాంటి చేష్టల వల్ల నిజమైన క్రికెట్ అభిమానులకు నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలకొద్దీ వెయిట్ చేసినా ఒరిజినల్ ప్లేస్లో టికెట్లు దొరకడం లేదని, కానీ డబ్బున్న వాళ్లకు మాత్రం ఇంత ఈజీగా టికెట్లు దొరుకుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.