టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆకాశానికెత్తేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో అశ్విన్ను ఆడించాలని అన్నాడు. పాక్ బ్యాటర్లకు అశ్విన్ను ఎదుర్కోవడం కష్టమేనని చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ 2023లో హై టెన్షన్ మ్యాచ్ ఏదంటే కచ్చితంగా అది భారత్, పాకిస్తాన్ మ్యాచే. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ పోరు మరికొన్ని గంటల్లో మొదలుకాబోతోంది. ఇలాంటి టైంలో జట్టు కూర్పు గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. కాగా.. భారత తుది జట్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఆడించాలని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. 'పాకిస్తాన్తో మ్యాచ్లో అశ్విన్ను ఆడించాలి. అతడు ఆఫ్ స్పిన్నర్ కాబట్టి, ఎడం చేతి వాటం బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పడం లేదు. అతడు చాలా తెలివైన వాడు. అశ్విన్ తన బౌలింగ్తో బ్యాటర్లను మానసికంగా పరీక్షిస్తాడు. అతడి బౌలింగ్ వేరియేషన్స్ని కనిపెట్టడంలో బ్యాటర్లు ఎప్పుడూ తడబడుతుంటారు' అని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా బ్యాటింగ్లో జట్టుకు అశ్విన్ ఉపయోగపడతాడని, 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అశ్విన్.. ఎలా లేదన్నా 20, 30 పరుగులు చేయగలడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అవసరమైనప్పుడు బ్యాటర్లకు మంచి పార్ట్నర్షిప్ కూడా ఇవ్వగలడని చెప్పుకొచ్చాడు.

అది మాత్రమే కాకుండా వరల్డ్ కప్ టోర్నీల్లో కూడా అశ్విన్ ప్రదర్శన చాలా బాగుంది. ఇప్పటివరకు 11 వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 25.38 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కూడా కేవలం 4.27 గా ఉంది. వీటన్నింటినీ బట్టి చూస్తే ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్లో అశ్విన్ను ఆడిస్తే కచ్చితంగా ప్రభావం చూపిస్తాడని అనిపిస్తోంది.