దాయాదుల పోరుకు సమయం వచ్చేసింది. ఇది జస్ట్ క్రికెట్ కాదు యుద్దం అనుకునే ఫ్యాన్స్ అంతా స్టేడియంలోని లక్ష సీట్లను నింపేశారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో రోహిత్ గెలిచిన తొలి టాస్ ఇదే కావడం గమనార్హం.
ఇది తమందరికీ ఒక కల వంటి మ్యాచ్ అని, దీన్ని తమ టీంమేట్స్ అంతా ఫీల్ అవబోతున్నారని రోహిత్ వెల్లడించాడు. తర్వాత మంచు ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని, అందుకే ఛేజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. మరింత బెస్ట్గా మారేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. మ్యాచ్ను చక్కగా ఆరంభించి, తమలోని బెస్ట్ చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

అలాగే తమ జట్టులో పెద్దగా మార్పులేం చేయలేదని, కేవలం ఒక్క మార్పుతోనే బరిలో దిగుతున్నామని రోహిత్ అన్నాడు. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడుతున్నట్లు చెప్పాడు. తనకు బాగా అచ్చొచ్చిన ఈ పిచ్పై గిల్ చెలరేగాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇషాన్కు అవకాశం దక్కినప్పుడల్లా రాణించాడని, ఈ మ్యాచ్ అతను మిస్ అయినందుకు ఫీల్ అవుతున్నట్లు రోహిత్ తెలియజేశాడు.
గిల్ ఆడుతున్నట్లు చెప్పగానే ఫ్యాన్స్ అందరూ పెద్దగా అరుస్తూ తమ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చూసిన రోహిత్.. టాస్ అయిపోయాక వెళ్తూ వెళ్తూ ఇది జస్ట్ ట్రైలరే, అసలు సినిమా ఆ తర్వాత ఉందని కామెంటేటర్తో చెప్పాడు. దీంతో ఈ మ్యాచ్పై ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇక పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులేం లేవని కెప్టెన్ బాబర్ ఆజమ్ చెప్పాడు. టాస్ గెలిస్తే తాను కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునే వాడినని అన్నాడు. ప్రస్తుతం తమ టీంలో మొమెంటం చాలా బాగుందని, దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. చాలా మంచి ప్రాక్టీస్ సెషన్స్ కూడా లభించాయని, మైదానంలో కూడా మెరుగ్గా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
పాకిస్తాన్ టీం: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్