ఈ వరల్డ్ కప్లో 16 మ్యాచులు జరిగాయి. కానీ అందరూ కూడా ఇంకా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో చాలా మంది పాక్ జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై భారత మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. తను ఆడే సమయంలో పాకిస్తాన్ జట్టు చాలా బాగా ఉండేదని దాదా చెప్పాడు.
ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాక్ జట్టు.. బ్యాటింగ్ విఫలమైతే మ్యాచ్ గెలవడానికి చాలా కష్టపడుతోందని చెప్పుకొచ్చాడు. 'మా టైంలో పాకిస్తాన్ ఒక డిఫరెంట్ టీం. మేం ఆడింది ఇలాంటి పాక్ టీంతో కాదు. ఈ టీం బ్యాటింగ్ చేసే సమయంలో కాస్త ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతోంది. ఈ బ్యాటింగ్ పెట్టుకొని వరల్డ్ కప్లో రాణించడం పాక్కు చాలా కష్టం' అని గంగూలీ తేల్చిచెప్పాడు.

అదే సమయంలో అద్భుతంగా ఆడుతున్న భారత జట్టుపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పాకిస్తాన్పై చెలరేగిన రోహిత్ శర్మను మెచ్చుకున్నాడు. ఈ మ్యాచులో మొదటగా బౌలింగ్ చేసిన భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఒకానొక దశలో ఈజీగా 300 పరుగులు చేస్తుందని అనుకున్న పాకిస్తాన్ను కనీసం 200 పరుగులు కూడా చేయనివ్వలేదు.
కేవలం 191 పరుగులకే పాక్ను ఆలౌట్ చేసిన భారత్.. ఈ ఛేజ్ను ఈజీగా పూర్తి చేసింది. దీంతో వరల్డ్ కప్లలో పాకిస్తాన్పై ఓటమి లేకుండా ఎనిమిదో విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. 'పాకిస్తాన్పై రోహిత్ అద్భుతంగా ఆడాడు. టీమిండియా అన్ని విభాగాలూ రాణిస్తున్నాయి. సరైన టైంలో ఇలా జరుగుతోంది' అని దాదా పేర్కొన్నాడు. గురువారం నాడు బంగ్లాదేశ్ను భారత్ ఎదుర్కోవడానికి రెడీ అవుతోంది.