వరల్డ్ కప్ ఆడే టీంను పాకిస్తాన్ ప్రకటించింది. ఆసియా కప్ ఆడిన టీంలో పలు మార్పులు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వరల్డ్ కప్ టీంను ప్రకటించింది. ఆసియా కప్లో భారత్, శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్తాన్.. ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరల్డ్ కప్లో కూడా ఇదే టీం ఆడుతుందా? అని చాలా మంది టెన్షన్ పడ్డారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్.. చాలా ఆలోచించి పాకిస్తాన్ జట్టుపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసియా కప్ సమయంలో గాయపడిన యంగ్ పేసర్ నసీం షా.. పూర్తిగా వరల్డ్ కప్ ఆడడా? లేక కొన్ని మ్యాచుల తర్వాత జట్టుతో కలుస్తాడా? అని ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే నసీం పూర్తిగా వరల్డ్ కప్కు దూరమైనట్లు పీసీబీ ప్రకటించింది. అతని స్థానంలో వెటరన్ పేసర్ హసన్ అలీని పీసీబీ ఎంపిక చేసింది. పాకిస్తాన్ 15 మంది బృందంతోపాటు అదనంగా ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్లను ప్రకటించింది. ఈ ముగ్గురు కూడా జట్టుతోపాటు వరల్డ్ కప్ కోసం భారత్కు ప్రయాణం అవుతారు.
'నసీం మా ప్రధాన బౌలర్. తను గాయపడటం దురదృష్టకరం. హస్నయిన్, ఇహ్సనుల్లా కూడా గాయలతో ఉన్నారు. లంక ప్రీమియర్ లీగ్ సహా తను ఆడిన ప్రతిచోటా హసన్ అలీ మెరుగ్గానే రాణించాడు. మిగతా వారితో పోలిస్తే అతను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. తను మంచి అనుభవం ఉన్న ప్లేయర్ కూడా. పాక్ తరఫున బడా టోర్నీల్లో బాగా ఆడాడు' అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
నసీంకు గాయం అవడంతో కొత్త బంతితో బౌలింగ్ చేయగలిగే బౌలర్ అవసరం ఉందని, కేవలం కొత్త బంతితోనే కాకుండా పాత బంతితో కూడా హసన్ అల బాగానే బౌలింగ్ చేస్తాడని ఇంజమామ్ అన్నాడు. హసన్ అలీ టీంలో ఉండటం వల్ల జట్టులో ఎనర్జీ పెరుగుతుందని, తను మంచి టీం మనిషని మెచ్చుకున్నాడు.
పాకిస్తాన్ వరల్డ్ కప్ టీం:
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, మహమ్మద్ నవాజ్, షహీన్ షా అఫ్రిదీ, హారిస్ రవూఫ్, మహమ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ
రిజర్వ్లు: మహమ్మద్ హారిస్, అబ్రార్ అహ్మద్, జమాన్ ఖాన్