భారత్, పాకిస్తాన్ మ్యాచులు ఎప్పుడు జరిగినా కూడా రికార్డులు బద్దలైపోవడం ఖాయం. ఈ మ్యాచుల కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉంటారు. ఆసియా కప్లో ఈ రెండు టీమ్స్ రెండుసార్లు తలపడ్డాయి. వీటిలో ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలలేదు. రెండో మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. కానీ ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉండటంతో ఆ మరుసటి రోజున మ్యాచ్ కొనసాగింది.
ఆ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్లో తెగ జోష్ నింపింది. మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడే మ్యాచ్ కోసం వీళ్లంతా ఎదురు చూస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లో హోటల్ రేట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అహ్మదాబాద్కు విమానం టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక నెల రోజుల క్రితం టికెట్ బుక్ చేసుకుంటే 5-12 వేల రూపాయల మధ్య ఉన్న విమానం టికెట్లు.. ఇప్పుడు గరిష్టంగా రూ.84 వేల వరకు పెరుగుతున్నాయి. అంటే ఈ రేట్లు 600 శాతం పెరిగిపోయాయన్నమాట. భారత్, పాక్ మ్యాచ్ చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఫ్యాన్స్ ఇక్కడకు క్యూ కట్టడమే దీనికి కారణం.
దీంతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ రావాలంటే జేబుకు చిల్లు పడక తప్పని పరిస్థితి తలెత్తింది. అంతేకాదు. కొన్ని రోజుల క్రితం ఈ మ్యాచ్ టికెట్లను సెకండ్ సెల్లింగ్లో అమ్మగా ఏకంగా రూ.57 లక్షల ధర పలికినట్లు సమాచారం. ఇదంతా గమనించిన నిపుణులు ఈ ఒక్క మ్యాచ్ అహ్మదాబాద్లో హోటల్స్ తదితర రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అంటున్నారు.
ఏదేమైనా మ్యాచ్ రోజుల్లో అహ్మదాబాద్ నుంచి రానూ, పోనూ మరిన్ని విమానాలు కేటాయించాలని, తద్వారా సమస్యలు తలెత్తకుండా ప్రజలు ఇబ్బందుల పడకుండా చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ట్రావెల్ కంపెనీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.