World Cup 2023: వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచులో న్యూజిల్యాండ్ను ఢీకొట్టేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి సెమీఫైనల్ మ్యాచులో భారత్, న్యూజిల్యాండ్ తలపడతాయి అని తెలిసినప్పటి నుంచి కూడా.. ఫ్యాన్స్ అంతా కూడా 2019 వరల్డ్ కప్ సెమీస్ గురించే మాట్లాడుతున్నారు.
అయితే అంతకుముందు కూడా కివీస్పై భారత్ కేవలం ఒక్కసారే గెలిచిందనే సంగతి మర్చిపోతున్నారు. ఈ వరల్డ్ కప్లో ధర్మశాల వేదికగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచులో భారత్ గెలిచింది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ చరిత్రలో కివీస్ను భారత్ కేవలం రెండుసార్లే ఓడించింది. ఒకసారి 1987లో ఓడిస్తే, ఆ తర్వాత మళ్లీ 2003లో న్యూజిల్యాండ్పై భారత్ గెలిచింది.

ఓవరాల్గా ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లలో మొత్తం 13 సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. వీటిలో 9 సార్లు భారత్ ఓటమినే చవిచూసింది. ఇక 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా కివీస్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఇక నాకౌట్స్లో అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కివీస్ను భారత్ ఓడించలేకపోయింది.
మరి ఆ చరిత్రను రోహిత్ సేన తిరగరాస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు 9 సార్లు వరల్డ్ కప్ సెమీస్ వరకు వచ్చిన కివీస్.. కేవలం రెండుసార్లే ఫైనల్లో అడుగుపెట్టింది. అంటే కివీస్కు కూడా నాకౌట్స్లో అంతగొప్ప రికార్డు లేదు. అయితే చివరగా జరిగిన రెండు వన్డే వరల్డ్ కప్లలో కివీస్ ఫైనల్ ఆడటం గమనార్హం.
కాబట్టి కివీస్ను తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ఈ మ్యాచ్ కనుక టీమిండియా గెలిస్తే.. నాకౌట్స్లో ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో నాకౌట్స్లో ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ విజయం కివీస్నే వరించింది. మరి రోహిత్ ఈ చరిత్రను తిరగరాస్తాడేమో చూడాలి.