భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ముందు పెద్ద కాంట్రవర్సీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు ఉపయోగించాలని అనుకున్న పిచ్ను మ్యాచ్ రోజు ఉదయం మార్చారు. దీంతో చాలా మంది దీనిపై విమర్శలు చేశారు. భారత జట్టుకు అనుకూలంగా ఉండే పిచ్పై కావాలని మ్యాచ్ నిర్వహిస్తున్నారని, భారత్ను గెలిపించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఈ కాంట్రవర్సీపై టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఆ పిచ్ అందరు ఆడటానికే ఉందని, అలాంటి దాన్ని ఎంపిక చేసినా కూడా ఈ గొడవలేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'అన్ని టీంల కోసం ఈ పిచ్ తయారు చేశారు. ఈ పిచ్ ఏం చేస్తుంది? ఏం చెయ్యదు? అనే డిస్కషన్ అసలు ఉండకూడదు' అని గవాస్కర్ చెప్పాడు.

'అసలు ఎలాంటి పిచ్ అయినా సరే ఈ భారత జట్టు ఈజీగా హ్యాండిల్ చేయగలదని నేను నమ్ముతున్నా. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అది చాలాసార్లు చూశాం కదా. ఒకవేళ ఇది డ్రైగా ఉన్న పిచ్ అయితే.. దానికి కూడా కారణం ఉంది. ఇటీవలి కాలంలో ఇక్కడ వర్షాలు పడటం లేదు. అందుకే పిచ్లో అంత తేమ ఉండకపోవచ్చు' అని వివరించాడు.
'ఈ పిచ్పై కొంత స్పిన్ ఉండొచ్చు దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ ముంబై పిచ్ మామూలుగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ. కాబట్టి ఇది అంత పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు. అయినా మన టీం దగ్గర ఉన్న బౌలింగ్ ఎటాక్ చూశారా? వాళ్లు అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే.. ముందు బౌలింగ్ చేసినా, రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ చేసినా పెద్ద తేడా ఏముండదు. అసలు పిచ్ పెద్ద సమస్యే కాదు' అని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ వార్తలు రాసిన జర్నలిస్టులను గవాస్కర్ తిట్టిపోశాడు. 'మ్యాచ్కు ముందు ఏం రాయాలో తెలియక కొందరు ఇలాంటి పిచ్చి రాతలు రాస్తుంటారు. మీ పేపర్లు నింపుకోవడానికి ఎక్కడ లేని వార్తలు సృష్టిస్తుంటారు. టాస్ తర్వాత మారిస్తే గొడవ చెయ్యొచ్చు. కానీ టాస్కు ముందు ఎన్ని పిచ్లు మార్చినా అసలు మ్యాటరే కాదు' అని పేర్కొన్నాడు.