అత్యంత నిలకడగా ఆడుతున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆట తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెప్పాడు. కోహ్లీకి ఆటపై చాలా ఆకలి ఉందని, అది చూసినప్పుడల్లా తనకు ఇన్స్పిరేషన్ దక్కుతుందని గిల్ వెల్లడించాడు.
అలాగే మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ ఏదో స్పెషల్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నిస్తాడని చెప్పాడు. కివీస్తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచులో కూడా కోహ్లీ చెలరేగాడు. 113 బంతులు ఎదుర్కొని 117 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తిచేసుకున్న తొలి ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు.

ఈ క్రమంలో సచిన్ పేరిట ఉన్న రికార్డు (49 సెంచరీలు) రికార్డును ఈ సందర్భంగా కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లీతోపాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడంపై గిల్ తన అభిప్రాయం వెల్లడించాడు.
'ప్రతిసారీ తను మైదానంలోకి వచ్చేటప్పుడు ఏదో ఒకటి సాధిస్తాడు. గత 10-15 ఏళ్లుగా ఇలా నిలకడగా రాణిస్తూ ఉండటం అంటే మాటలు కాదు. అది నిజంగా నాకు స్ఫూర్తినిస్తుంది. నా వరకైతే కోహ్లీ స్కిల్స్ కన్నా తనలో ఉన్న ఆకలి, ఇంటెన్సిటీ చాలా ఇష్టం. తన ఆటలో అవే నాకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. అలాగే ఇంత కాలం అదే జోరు కొనసాగించడం మాటలు కాదు' అని గిల్ చెప్పుకొచ్చాడు.
గిల్ ఎప్పుడూ తన ఐడల్ కోహ్లీ అని చెప్తూనే ఉన్నాడు. ఇక కీలకమైన సెమీఫైనల్ మ్యాచులో కూడా కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాలి గాయంతో రిటైర్డ్ హర్ట్ అయిన అతను.. చివర్లో తిరిగొచ్చి 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.