World Cup 2023: భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగే వన్డే వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్కు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ బ్యాటర్లు చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మరో కీలకమైన విషయం కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేలా ఉంది. అదేంటంటే? సముద్రం నుంచి వచ్చే గాలి.
అందుకని ఇది మ్యాచ్ మొత్తంపై ప్రభావం చూపదు. రెండో ఇన్నింగ్స్ తొలి పది ఓవర్లలో బ్యాటర్లకు ఈ గాలి వల్ల చుక్కలు కనిపిస్తాయి. ఈ గాలి వల్ల బంతి చాలా స్వింగ్ అవుతుంది. ఒక్కోసారి బౌలర్లే ఆశ్చర్యపోయేలా ఈ మూవ్మెంట్ ఉంటుంది. అంత మూవ్మెంట్ను తట్టుకొని బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు.

ఈ విషయం ఇప్పటికే ఈ వరల్డ్ కప్లో రుజువైంది కూడా. వాంఖడేలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్ తొలి పది ఓవర్లలో వరుసగా 67/4, 35/3, 14/6, 52/4 స్కోర్లు నమోదయ్యాయి. వీటిలో ఆఫ్ఘనిస్తాన్పై 67/4తో ఉన్న ఆస్ట్రేలియాను మ్యాక్స్వెల్ (201 నాటౌట్) గెలిపించాడు. మిగతా మ్యాచులన్నీ కూడా ఛేజింగ్ జట్లు ఓడిపోయాయి.
ఈ ఛేజింగ్ జట్లు తొలి పది ఓవర్లను జాగ్రత్తగా ఆడితే ఆ తర్వాత బ్యాటింగ్ చేయడం సులభం అయిపోతుంది. ఎందుకంటే ఈ సముద్రపు గాలి కేవలం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల మధ్య మాత్రమే ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత చల్లబడిపోతుంది. ఇక ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం అంత కష్టమేం కాదు.
ఇది చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. వాంఖడేలో మ్యాచులు చూసే స్థానికులకు బాగా తెలిసిన విషయమే. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా టీమిండియా ఛేజింగ్ చేసినప్పుడు తొలి పది ఓవర్లు బ్యాటర్లు కష్టపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కివీస్ కనుక ఛేజింగ్ చేయడానికి వస్తే భారత బౌలర్లు వాళ్లకు చుక్కలు చూపించడం గ్యారంటీ.
అదే భారత్ కనుక ఛేజింగ్ చేయడానికి వస్తే.. ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్ వంటి పేసర్లకు ఈ గాలి వల్ల దొరికే సహకారం అంతా ఇంతా కాదు. కాబట్టి ఈ పది ఓవర్లలో మరీ వేగంగా ఆడే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.