World Cup 2023: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఎడాపెడా సెంచరీలు బాదేస్తూ దూసుకెళ్తున్నాడు. తాజాగా కివీస్తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా శతకంతో గర్జించాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్గా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ చూసిన అభిమానులు త్వరలోనే అతను వంద సెంచరీల మార్కు దాటేస్తాడని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీపై కీలక కామెంట్స్ చేశాడు. 'ఇలాంటి ప్లేయర్లు సెంచరీలు చేయడం మొదలు పెడితే.. వాళ్లు చాలా సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూనే పోతారు. వీళ్లకు ఏదీ అసాధ్యం కాదు' అని శాస్త్రి చెప్పాడు.

'కోహ్లీ ఆడే తర్వాతి పది ఇన్నింగ్సుల్లో మరో ఐదు సెంచరీలు చూసినా ఆశ్చర్యం అక్కర్లేదు. భారత జట్టు మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతుంది. కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఉన్నాడు. కోహ్లీ మరో మూడు, నాలుగేళ్లు క్రికెట్ ఆడతాడనే ఆలోచనే బుర్ర తినేస్తుంది' అని అన్నాడు. అలాగే కేవలం బౌండరీలపై ఆధారపడకుండా సింగిల్స్, డబుల్స్ తీసే కోహ్లీ ట్యాలెంట్ను కూడా మెచ్చుకున్నాడు.
'కోహ్లీ బ్యాటింగ్లో ముఖ్యమైన విషయం అతని రన్నింగ్. కేవలం ఫోర్లు, సిక్సర్ల కోసమే ప్రయత్నించకుండా వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ పరుగులు చేయడం అతని ప్రత్యేకత. దానికి కోహ్లీ అంతటి ఫిట్నెస్ కూడా అవసరమే. దీని వల్ల కోహ్లీపై ఎప్పుడూ పెద్దగా ఒత్తిడి ఉండదు' అని చెప్పుకొచ్చాడు.

'బౌండరీలు బాదలేని పరిస్థితి ఎదురైనా కూడా కోహ్లీ పెద్దగా టెన్షన్ పడడు. ఎందుకంటే అతను కావాలంటే సింగిల్స్, డబుల్స్ తీస్తూ కూడా స్కోరు బోర్డును నడిపించగలడు. ఇక చివర్లో లక్ష్యాన్ని ఛేదించడానికి ఏం కావాలో అది చెయ్యగలిగే ట్యాలెంట్ కూడా కోహ్లీ సొంతం' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.